విన్నపాలు వినవలె విఘ్ననాథా..
అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వర ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. ఆలయ ప్రధాన అర్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామికి తెల్లవారు జామున మేలుకోలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, లక్ష్మీగణపతి హోమం, గరికపూజ వంటి విశేష పూజలు చేశారు. సాయంత్రం ఎనిమిది గంటలకు స్వామికి విశేష సేవలు చేసి ఆలయ తలుపులు వేశారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 62 మంది పాల్గొన్నారు. 41 మంది భక్తులు స్వామివారి హోమం నిర్వహించారు. నలుగురు భక్త దంపతులు స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. స్వామికి ఇద్దరు భక్త దంపతులు ఉండ్రాళ్ల పూజ చేశారు. ఇద్దరు చిన్నారులకు నామకరణ, ఏడుగురికి అన్నప్రాశన, ఐదుగురికి అక్షరాభ్యాసాలు చేశారు. ఇద్దరికి తులాభారం, 50 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 3,226 మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారు. ఆదివారం వివిధ పూజా టిక్కెట్లు, అన్నదాన విరాళాల ద్వారా రూ.4,55,732 ఆదాయం లభించినట్లు ఈఓ, అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.


