పెన్షనర్ల ధర్నా
అమలాపురం టౌన్: కనీస పెన్షన్ రూ.9 వేలను డీఏతో కలిపి చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా యునైటెడ్ యాక్షన్ కమిటీ ఆ్ఫ్ ఈపీఎఫ్ 95 పెన్షనర్స్ ఆర్గనైజేషన్ అమలాపురం శాఖ ఆధ్వర్యంలో బుధవారం గడియారం స్తంభం సెంటర్లో పెన్షనర్లు ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమకు ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 8వ పీఆర్సీ అమలయ్యే వరకూ మధ్యంతర భృతి ఇవ్వాలని కోరారు. పెండింగ్లో ఉన్న అన్ని రకాల బకాయిలు తక్షణమే చెల్లించాలన్నారు. ధర్నాలో అమలాపురం పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు కడలి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి జి.గోపాలకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి ఎం.వెంకటేశ్వరరావు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.
రాజోలులో
జనసేన పంచాయితీ
మలికిపురం: రాజోలు నియోజకవర్గంలో ఇటీవల చోటు చేసుకున్న వివాదాలు, ఘర్షణల నేపథ్యంలో ఆ పార్టీ మంగళగిరి కార్యాలయం నుంచి వచ్చిన ప్రత్యేక బృందం బుధవారం నియోజక వర్గంలో పర్యటించింది. బండారు శ్రీనివాస్, కొటికలపూడి గోవిందరావుతో కూడిన ఆ బృందం జనసేన కార్యకర్తలను విచారణ చేసింది. ఈ సందర్భంగా మలికిపురం ఎల్ఎస్ ల్యాండ్ మార్క్లో జరిగిన సమావేశంలో కూడా పార్టీ కార్యకర్తల నుంచి సమాచారం తీసుకుంది. నియోజకవర్గంలో దిరివాల బాలాజీ, యెనుముల వెంకటపతిరాజు వర్గాల మధ్య ఇటీవల తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. సోషల్ మీడియాలో తీవ్ర ఆరోపణలతో పోస్టులు పెట్టుకున్నారు. దీంతో పోలీస్లు కవాతు కూడా నిర్వహించారు.
గుండెపోటుతో
వైద్యుడి మృతి
నిడదవోలు: పట్టణంలోని అమ్మ హాస్పిటల్ వైద్యుడు, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంవో అందే వీవీఎస్ తాతారావు (56) బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. తణుకులో విధులు ముగించుకుని నిడదవోలు ఇంటికి కారులో వస్తుండగా ఉండ్రాజవరం రాగానే ఆయనకు గుండెపోటు వచ్చింది. కారును రోడ్డు పక్కగా ఆపగా స్థానికులు గమనించి బయటకు తీసి అంబులెన్సులో తణుకు తరలిస్తుండగానే కన్నుమూశారు. ఆయనకు భార్య లావణ్య, కుమార్తెలు చిట్టి ప్రణతి, ప్రవళ్లిక ఉన్నారు. తాతారావు తల్లి మొగల్తూరు వైఎస్సార్ సీపీ ఎంపీపీగా చేస్తున్నారు. తండ్రి భుజంగరావు వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. ఆయన మృతికి రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే గెడ్డం శ్రీనివాస్ నాయుడు తదితరులు సంతాపం తెలిపారు.
పెన్షనర్ల ధర్నా


