సాక్షి, తూర్పుగోదావరి: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబును మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ మంగళవారం కలిశారు. రాజమండ్రి జైలులో అంబటితో ఉండవల్లి అరణ్కుమార్, మాజీ మంత్రి కన్నబాబు ములాఖత్ అయ్యారు.
అనంతరం ఉండవల్లి.. మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో కొత్త పద్దతి నడుస్తుందన్నారు. ‘‘ధ్వంసం చేసిన వారికి స్టేషన్ బెయిల్.. విమర్శించిన వారికి జైలు. పెట్రోల్ బాంబులతో దాడులు చేసిన వారికి బెయిల్ దారుణం. జైల్లో వేయడం, 30 చోట్ల నుంచి కంప్లైట్ల పెట్టడం దారుణం. చంద్రబాబు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. కక్ష సాధింపు అనేది క్లియర్ గా తెలిసిపోయింది’’ అని ఉండవల్లి పేర్కొన్నారు.
కాగా, అంబటి రాంబాబుకు ఒక కేసులో బెయిల్ రాగా, మరో కేసులో ఈ నెల 22వ తేదీ వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న అంబటి రాంబాబును పోలీసులు సోమవారం గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టులో హాజరు పరిచారు. ఒక కేసులో బెయిల్ లభించినా.. మరో కేసులో 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను తిరిగి రాత్రి 7.30 గంటలకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తీసుకువచ్చారు.
అంబటిపై ఆగని కుట్రలు
నల్లపాడు పోలీసు స్టేషన్లో కేసుకు సంబంధించి అంబటి రాంబాబుకు బెయిల్ ఇచ్చిన స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్తోపాటు సౌకర్యాలు కోరుతూ రాంబాబు వేసిన ఎమినిటీస్ పిటిషన్లను తిరస్కరించారు. నల్లపాడు కేసులో బెయిల్ వస్తుందన్న ఉద్దేశంతో గతంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనపై పట్టాభిపురం పోలీసు స్టేషన్లో పెట్టిన కేసులో పీటీ వారెంట్పై సోమవారం రాజమండ్రి నుంచి గుంటూరు తీసుకువచ్చి ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది వక్కాల సూరిబాబు, మాజీ ఎంపీపీ మాతంగి శ్రీకాంత్, సహచర న్యాయవాదులు, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు వాదనలు వినిపించారు.
బెయిలబుల్ సెక్షన్లతో ఉన్న కేసుల్లో వ్యక్తిగత స్వేచ్ఛ రాజ్యాంగ బద్ధమైన హక్కు అని, అలాంటి సందర్భాల్లో అరెస్ట్, రిమాండ్ అవసరంపై కోర్టు సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే.. ఈ కేసులో ఈ నెల 22 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కాగా.. అంబటికి ఎట్టిపరిస్థితుల్లో బెయిల్ రాకుండా, పాత కేసుల్లో పీటీ వారెంట్లు దాఖలు చేసేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు.


