ఆంధ్రజ్యోతికి భూకేటాయింపు విషయాన్ని కౌన్సిల్ సమావేశంలో టేబుల్ అజెండా 67వ అంశంగా చేర్చిన కాపీ
ఆమోదం లేకపోయినా వారికి మాత్రం ‘ఆమోద’మే!
కౌన్సిల్లో ఆమోదించకపోయినా ఆమోదించినట్టు రికార్డులు
కౌన్సిల్ సమావేశం జరిగిందే 2025 ఆగస్టు 22న
టేబుల్ అజెండాలోని 67వ అంశాన్ని ఆమోదించని కౌన్సిల్
స్పష్టంగా ప్రకటించిన మేయర్
తర్వాత మాత్రం ఆమోదించినట్టు రికార్డులు
తహసీల్దారుకు లేఖ రాసిన జీవీఎంసీ జోనల్ కమిషనర్
ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లే కారణమంటూ ఆరోపణలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇప్పటికే తమ బంధువు సంస్థ గీతం ఆక్రమిత భూములను క్రమబబ్ధికరించుకునేందుకు గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)లో ఎన్నడూ లేనివిధంగా గూండారాజ్ను అమలు చేసి తీర్మానాన్ని ఆమోదించుకున్న అధికార పార్టీ.. ఇప్పుడు తోకపత్రిక విషయంలో మరో అడుగు ముందుకు వేసి ఏకంగా రికార్డులు మార్చి మరీ భూమిని కట్టబెట్టేందుకు సిద్ధపడినట్టు స్పష్టమవుతోంది. అత్యవసరమైన అంశాలను చేర్చాల్సిన టేబుల్ అజెండాలో చివరి అంశంగా (67వ అంశం) తన తోకపత్రిక ఆంధ్రజ్యోతి పబ్లికేషన్స్.. ఆమోద పబ్లికేషన్స్కు భూ కేటాయింపు అంశాన్ని గత ఏడాది ఆగస్టు 22 నాటి సమావేశంలో చంద్రబాబు ప్రభుత్వం తెరమీదకు తీసుకొచి్చంది. అయితే ఈ విషయాన్ని కౌన్సిల్ తిరస్కరించింది.

కౌన్సిల్ సమావేశం ఈ తీర్మానాన్ని తిరస్కరించిన నేపథ్యంలో రాత్రి 9 గంటల వరకు జరిగిన ఈ సమావేశపు వివరాలను ప్రకటన రూపంలో జీవీఎంసీ విడుదల చేసింది. ఇందులో స్పష్టంగా టేబుల్ అజెండాలో ఉన్న 67వ అంశాన్ని కౌన్సిల్ ఆమోదించలేదని ప్రకటించారు. అయినప్పటికీ.. రికార్డుల్లో మాత్రం కౌన్సిల్ తీర్మానాన్ని ఆమోదించినట్టుగా పేర్కొంటూ తహసీల్దారుకు జీవీఎంసీ జోనల్ కమిషనర్ (జోన్–2) లేఖ రాశారు. ఇందులో స్పష్టంగా 2025 ఆగస్టు 22 నాటి జీవీఎంసీ కౌన్సిల్లో ఆమోదించినట్టుగా పేర్కొన్నారు. ఈ రికార్డుల తారుమారులో ఎవరిపాత్ర ఎంత ఉందనే వ్యవహారం ఇప్పుడు తేలాల్సి ఉంది.
లాంఛనమే అయితే..!
వాస్తవానికి జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం లాంఛనమే అంటూ స్థానిక సంస్థల అధికారాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేసింది తోకపత్రిక. నిజంగా జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానం కేవలం లాంఛనమే అయితే.. గీతంకు భూ కేటాయింపుపై ఎందుకంతగా రాద్ధాంతం చేసి.. ప్రతిపక్ష కార్పొరేటర్లపై దాడికి దిగి మరీ చర్చలేకుండానే ఆమోదించినట్టుగా ప్రకటించారు. స్థానిక సంస్థలు అంగీకరించకుండా భూమిని కేటాయించడం నేరుగా ముఖ్యమంత్రికి కూడా సాధ్యమయ్యే పనికాదు. ఆ విషయం తోకపత్రికకు కూడా స్పష్టంగా తెలుసు. అందుకే అత్యవసరంగా టేబుల్ అజెండా మీదకు తెచ్చి.. ఆమోదించుకునేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే సభ్యుల నుంచి ఒత్తిడి రావడంతో ఆమోదం పొందలేదు.
ఆ తర్వాత మరో కౌన్సిల్ సమావేశంలో ఆమోదింపజేసుకునేందుకు తీర్మానం రూపంలో ముందుకు రావాల్సిందే. అంతేతప్ప.. ఏదో ఒక సభ్యుడు అనుమానం వ్యక్తం చేస్తే.. వ్యక్తిగతంగా అనుమానం తీర్చాం కాబట్టి ఆమోదించినట్టుగా రికార్డులు సృష్టిస్తామంటే కుదరని పని. ఈ విషయం కూడా తోకపత్రికకు స్పష్టంగా తెలుసు. ఆమోదించని తీర్మానాన్ని.. కౌన్సిల్ తిరస్కరించిన తీర్మానాన్ని మళ్లీ కౌన్సిల్ ముందు పెడితే ఆమోదించే అవకాశం లేదని అవగాహన ఉంది. అందుకే రికార్డులు తారుమారు చేసి కౌన్సిల్ తీర్మానాన్ని ఆమోదించినట్టుగా రికార్డులు మార్చివేశారు.
ఈ రికార్డుల మారి్పడి వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంతమేర ఉందనేది లోతుగా విచారిస్తే కచి్చతంగా అసలు దొంగల గుట్టు బయటకు వచ్చే అవకాశం ఉంది. నిజంగా జీవీఎంసీ తీర్మానం లాంఛనమే అయితే రికార్డులు మార్చాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? వాస్తవానికి జీవీఎంసీ తీర్మానం తప్పనిసరి కాబట్టే ఏకంగా రికార్డులు మార్చి మరీ.. ఆమోదించని తీర్మానాన్ని ఆమోదించినట్టుగా పేర్కొన్నారు. ఎలాగూ ఉంది తమ ప్రభుత్వమే కదా అనే ధీమాతోనే ఈ తతంగం నడిపించినట్టు తెలుస్తోంది.
రికార్డులు మార్చిందెవరు?
జీవీఎంసీ కౌన్సిల్ సమావేశపు అజెండాను సెక్రటరీ సెల్ తయారుచేస్తుంది. సమావేశపు వివరాలను కూడా సదరు సెక్రటరీ సెల్ నమోదు చేయడంతోపాటు మినిట్స్ను కూడా నమోదు చేస్తుంది. ఈ విధంగా తయారైన మినిట్స్ను మేయర్ ఆమోదానికి ఉంచి.. ఆ కాపీని సభ్యులందరికీ అందజేయాల్సి ఉంటుంది. అయితే కౌన్సిల్లో ఆమోదించని విషయాన్ని కాస్తా ఆమోదించినట్టు రికార్డుల్లోకి ఎక్కించడంలో సెక్రటరీతోపాటు సెక్రటరీ సెల్ పాత్ర ఏమిటనేది తేలాల్సి ఉంది. అంతేకాకుండా సదరు సెక్రటరీ సెల్పై ఒత్తిడి తెచి్చన వ్యక్తులు ఎవరనేది కూడా లోతుగా విచారిస్తే తేలనుంది.
ఇప్పటివరకు సదరు సమావేశపు వివరాలను సభ్యులకు కూడా అందించలేదని తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగానే ఈ సమావేశపు వివరాలను సభ్యులకు ఇవ్వకుండా దాగుడు మూతలు ఆడారా? అనే విషయం కూడా తేలాల్సి ఉంది. ఎలాగూ ఉంది తమ ప్రభుత్వమే కదా అని స్థానిక సంస్థల నిర్ణయాన్ని ఇష్టారాజ్యంగా చేసుకుంటూ పోవడం ఏమిటనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. మొత్తంగా ఆమోదం లభించని తీర్మానం కాస్తా తమ తోకపత్రిక కోసం ‘ఆమోద’ముద్ర వేయించడంలో ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


