సమన్వయంతో వీరేశ్వరస్వామి ఉత్సవాలు
ఐ.పోలవరం: మురమళ్ల శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి వారి ఆలయంలో ఈ నెల 15 నుంచి 19 వరకు జరగబోయే మహాశివరాత్రి ఉత్సవాలలో అధికారుల సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని డీఆర్వో కె.మాధవి ఆదేశించారు. ఆలయ ఆవరణలో చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్ కమిషనర్, కార్య నిర్వాహణాధికారి వి.సత్యనారాయణ అధ్యక్షతన మంగళవారం సమావేశం జరిగిన సమావేశంలో డీఆర్వో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ భక్తుల భద్రతకు పెద్ద పీట వేయాలన్నారు. జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున ఎప్పటికప్పుడు పారిశుధ్య చర్యలు చేపట్టాలన్నారు. రెవెన్యూ, పంచాయతీ, మెడికల్ సిబ్బంది మూడు షిఫ్ట్లలో పని చేయాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. 19వ తేదీన జరిగే స్వామివారి జల విహార ఉత్సవ ఏర్పాట్లు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సత్య సీతారామ శర్మ, పోలీసు శాఖ, రెవెన్యూ, మత్స్య, అగ్నిమాపక, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.
100 రోజుల
ప్రణాళికపై దిశానిర్దేశం
అమలాపురం రూరల్: జిల్లాలో పదో తరగతి విద్యార్థులలో వెనుక గ్రేడులలో ఉన్నవారిని గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో విద్య, సమగ్ర శిక్ష, సంక్షేమ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి 100 రోజుల ప్రణాళిక అమలుపై కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. మూడు రెవెన్యూ డివిజన్లలో వెనుకబడిన వారిని గుర్తించి రెసిడెన్షియల్ పాఠశాలలో జాయిన్ చేసి ప్రత్యేక తరగతుల ద్వారా మెరుగైన విద్యా బోధన అందించాలని సంక్షేమ, విద్యా శాఖల అధికారులను ఆదేశించారు. డీఈవో పి నాగేశ్వరరావు, సమగ్ర శిక్ష ఎడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జి మమ్మీ, సాంఘిక సంక్షేమ బీసీ సంక్షేమ జిల్లా అధికారి పి జ్యోతిలక్ష్మి దేవి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు ఎస్.మధుసూదన్ పాల్గొన్నారు.
సర్వీస్ రోడ్లు పూర్తి చేయాలి
జొన్నాడ ఫ్లై ఓవర్ వద్ద సర్వీస్ రోడ్లు నిర్మాణ పనులను ఈ నెల 15 ప్రారంభించి మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ రామకృష్ణను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఆర్డీవోలు, జాతీయ రహదారుల అధికారులు , రెవెన్యూ అధికారులు, జొన్నాడ ఫ్లైఓవర్ కాంట్రాక్లర్లతో సమావేశం నిర్వహించి ఫ్లైఓవర్ నిర్మాణ పనులపై సమీక్షించారు. 216 ఈ రావులపాలెం నుండి అమలాపురం వరకు బైపాస్ నిర్మాణం కు సంబంధించి భూ సేకరణ స్థితిగతులను ఆయన రెవెన్యూ సిబ్బంది జాతీయ రహదారుల ఇంజినీర్లతో సమీక్షించారు. ఆర్డీవోలు కే మాధవి, పి శ్రీకర్, తహసీల్దార్లు చినబాబు, వీఎస్ దివాకర్, రాంబాబు, జాతీయ రహదారుల డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నిక్కీ క్రాస్ పాల్గొన్నారు.
చట్టం లక్ష్యాలను
ప్రజలకు చేరువ చేయాలి
రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సభ్యుడు కృష్ణ కిరణ్
అమలాపురం రూరల్: ఆహార భద్రత చట్టం లక్ష్యాలు ప్రజల వరకు సమర్థంగా చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలని రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సభ్యుడు జక్కంపూడి కృష్ణ కిరణ్ అధికారులకు పిలుపునిచ్చారు. ఆయన మంగళవారం జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రేషన్ సరఫరా, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం, అంగన్వాడీ పోషకాహార పథకాల అమలులో లోపాలు ఉండకూడదన్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో వేగం పెంచాలని సూచించారు. పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని వండి వడ్డించాలని సూచించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి అడపా ఉదయ భాస్కర్ మాట్లాడుతూ ఆహార కమిషన్ జాతీయ ఆహార భద్రత చట్టం అమలు తీరును పర్యవేక్షిస్తుందన్నారు. పౌరసరఫరాల జిల్లా మేనేజర్ పి.శ్రీనివాస్ ఏఎస్ఓ శరత్, జిల్లా విద్యాశాఖ అధికారి పి.నాగేశ్వరరావు, తూనికలు కొలతల నియంత్రణాధికారి విశ్వేశ్వరరావు, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు.
సమన్వయంతో వీరేశ్వరస్వామి ఉత్సవాలు


