దొరచేతిలో వైకుంఠం!
సాక్షి, అమలాపురం/అల్లవరం: ‘‘అంకెల గారడీ, మాటల మాయ, చెప్పదొకటి.. చేసేదొకటి, అరచేతిలో వైకుంఠం, హామీల అమలులో మోసం, సంక్షేమ లబ్ధి శూన్యం’’. చంద్రబాబు ప్రభుత్వం శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై జిల్లా వాసులలో వ్యక్తమవుతున్న అభిప్రాయాలు ఇవి. యువత, నిరుద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి, రైతు, మహిళలు.. ఇలా చెప్పుకుంటూ పోతే సర్వ జనం రాష్ట్ర బడ్జెట్పై అసంతృప్తి స్వరం వినిపిస్తున్నారు.
● జిల్లాలో ప్రధానమైంది వ్యవసాయం. దీని అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులంటూ చూపించలేదు. ప్రధానంగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా ఈ ఏడాది నుంచి చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తుందని రైతులు ఆశలు పెట్టుకున్నారు. పంట నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీకి ఇవ్వాల్సిన సొమ్ము లెక్కలలో చూపించపోవడంతో సుమారు 1.80 లక్షల మంది రైతులు అసంతృప్తితో ఉన్నారు.
● రాయలసీమ ప్రాంతాన్ని గ్లోబల్ హార్టీకల్చర్ హబ్గా గుర్తించామని, రూ.వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. అయితే అక్కడ కన్నా ఎక్కువ ఉద్యాన పంటలు సాగే గోదావరి జిల్లాలను పక్కన బెట్టడం రైతులను జీర్ణించుకోలేపోతున్నారు. మరీ ముఖ్యంగా కోనసీమ జిల్లాలో కొబ్బరి, అరటి, కోకో, పోక, పువ్వులు, కూరగాయలు సుమారు 1.50 లక్షల ఎకరాలలో సాగుతున్నాయి. ఉద్యాన ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అయినా ఇక్కడ ఉద్యాన రైతులకు మేలు చేసే నిర్ణయం తీసుకోలేదు.
● గోదావరి డెల్టాకు ఈ ఏడాది బడ్జెట్లో రూ.రెండు వందల కోట్లు చూపించారు. గత బడ్జెట్లోనూ ఇలా చూపించినా పనులు చేయలేదు. చివరకు రూ.మూడు కోట్లతో చేపట్టిన పంట, మురుగునీటి కాలువల్లో పూడిక తొలగింపు పనులు కూడా చేయలేదు. డెల్టాలో మురుగునీటి కాలువలు, పంట కాలువల్లో కనీస మరమ్మతులు చేసేందుకు రూ.500 కోట్ల అవసరమని నిపుణుల అంచనా.
● నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించకపోవడంపై వారు ఆగ్రహంతో ఉన్నారు. కనీసం ఎంఎస్ఎంఈలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిధులు పెంచలేదు.
● 12వ పీఆర్సీపై ప్రకటన చేయకపోవడం, బడ్జెట్లో మధ్యంతర భృతి (ఐఆర్) ప్రస్తావన లేకపోవడం, నాలుగు డీఏల విషయాన్ని తేల్చకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు, మరీ ముఖ్యంగా ఉపాధ్యాయుల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
● మహిళలను చంద్రబాబు ప్రభుత్వం మరీ మోసం చేసింది. ఆడబిడ్డ నిధిగా నెలకు రూ.1,500 ఇస్తామన్న హామీ అమలుకు ఈ ఏడాదీ కేటాయింపులు చేయలేదు.
● కోనసీమ జిల్లాకు నేరుగా మేలు చేసే ఒక్క ప్రకటన కూడా వెలువడ లేదు. పరిశ్రమల ఏర్పాటు, వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా అనుబంధ ప్రోసెసింగ్ ప్లాంట్లు, విలువ ఆధారిత ఉత్పత్తుల పరిశ్రమల వంటి ఊసే లేదు. చివరకు కోనసీమ రైల్వే ప్రాజెక్టు భూసేకరణకు అవసరమైన రూ.300 కోట్ల ప్రస్తావన కూడా లేకపోవడం ఈ ప్రాంత వాసులను అసంతృప్తికి గురి చేస్తోంది.
రాష్ట్ర బడ్జెట్పై అన్ని వర్గాలలో
పెదవి విరుపు
కోనసీమకు ప్రత్యేకంగా
ఒనగూడింది శూన్యం
వ్యవసాయ, ఉద్యాన,
ఆక్వా రంగాలకు మొండి చేయి
నిరుద్యోగ భృతి, ఉద్యోగులకు పీఆర్సీ ఊసే లేదు
కోనసీమ రైల్వే భూ సేకరణ
మాట ఎత్తని వైనం
దొరచేతిలో వైకుంఠం!


