ఆకర్షించే శివైశిష్ట్యం
● నేడు మహాశివరాత్రి
● ముస్తాబైన శైవ క్షేత్రాలు
● ఆలయాలకు పోటెత్తనున్న భక్తులు
సాక్షి, అమలాపురం: సప్త గోదావరి నదీపాయల ప్రవాహంతో పునీతమైన కోనసీమ జిల్లాలో గ్రామగ్రామాన శివాలయాలున్నాయి. నదీపాయలను ఆనుకునే ఉన్న పురాణ ప్రసిద్ధి చెందిన ఆలయాలకు కూడా కొదవలేదు. వీటిలో స్వయంగా శ్రీరామ చంద్రమూర్తి ప్రతిష్ఠించిన ఆలయాలు కూడా ఉన్నాయని భక్తుల విశ్వా సం. ఒక్కొక్క శివాలయానిది ఒక్కో చరిత్ర. అక్కడ జరిగే పుష్కర జలాల అభిషేకాలు, ఇతర అభిషేకాలు కూడా ఆయా ఆలయాలకు ప్రత్యేకమే. ఈ ఆలయాలకు నిత్యం భక్తుల రద్దీ ఉంటుంది. మహా శివరాత్రి రాత్రి సందర్భంగా ఆదివారం వేలాదిగా ఆలయాలకు భక్తులు పోటెత్తుతారు. జల్లాలో ముఖ్యమైన ఆలయా ల్లో భక్తులను ఆకర్షించే విశిష్టతలపై ప్రత్యేక కథనం..
శివ–శక్తి కలయికకు ప్రతీకగా..
అజ్ఞానంపై జ్ఞానం విజయానికి, శివ–శక్తి కలయికకు ప్రతీకగా మహాశివరాత్రిని జరుపుతారు. శివుడు మొట్టమొదటిసారిగా లింగాకారంలో ఆవిర్భవించిన రోజు గా కూడా మహా శివరాత్రిని భక్తులు విశ్వసిస్తారు. జి ల్లాలో ద్రాక్షారామ, కోటిపల్లి, ముక్తేశ్వరం, అయినవి ల్లి, కుండలేశ్వరం ప్రసిద్ధి చెందిన ఆలయాలుగా గుర్తింపు పొందగా, వందల సంఖ్యలో ఆలయాలు ఆదివారం జరిగే మహా శివరాత్రికి ముస్తాబవుతున్నాయి. కోటిపల్లి, కుండలేశ్వరం, మురమళ్ల వంటి ప్రాంతాల్లో భక్తులు నదీపాయాల్లో పుణ్యస్నానాలు చేసి అనంతరం స్వామివారిని దర్శించుకుంటారు. భైరవపాలెం, మగసానితిప్ప, పల్లం శివారు బ్రహ్మ సమేధ్యంలోని ఆలయాల వద్ద భక్తులు సముద్ర స్నానాలు చేస్తారు.
● పంచారామాల్లో ఒకటిగా, త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా రామచంద్రపురం మండలం ద్రాక్షారామ భీ మేశ్వరస్వామి ఆలయం ప్రసిద్ధి పొందింది. మహి మాన్విత శివలింగ క్షేత్రాల్లో ఇదొకటి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఇది 12వ శక్తి పీఠం. మాణిక్యాంబ అమ్మ వారు ఇక్కడ వెలిశారు. దీనిని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. ఇక్కడ శివలింగం ఎత్తు 18 అడుగులు.
● గౌతమీ నదీ తీరాన కె.గంగవరం మండలం కోటిపల్లిలో శ్రీ పార్వతీ సమేత సోమేశ్వరస్వామి ఆలయం ఉంది. రాజ రాజేశ్వరీ సహిత సోమేశ్వరస్వామి, అమ్మవార్లతో కూడిన కోటేశ్వర స్వామివారు, శ్రీదేవి, భూదేవి సహిత జనార్థన స్వామివారు ఇక్కడ కొలువయ్యారు. ఈ విగ్రహాలను ఇంద్రుడు, చంద్రుడు, కశ్యప మహర్షి ప్రతిష్ఠించారని భక్తుల నమ్మకం.
● అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో వేంచేసి ఉన్న ముక్తికాంత సమేత క్షణముక్తేశ్వర స్వామి విగ్రహాన్ని స్వయంగా శ్రీరామ చంద్రమూర్తి ప్రతిష్ఠించారంటారు. స్వామివారిని దర్శిస్తే పాపాల నుంచి విముక్తి లభిస్తోందని నమ్మకం.
● వృద్ధ గౌతమి నదీ తీరంలో వెలిసిన సుప్రసిద్ధ శైవక్షేత్రం మురమళ్ల. ఇక్కడ ప్రధాన దైవం భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి. స్వామి వారు నిత్యకల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్నారు. పెళ్లి కాని యువతీ, యువకులు ఇక్కడ స్వామివారికి కల్యాణం చేయించుకుంటే పెళ్లివుతుందని నమ్మకం. శివరాత్రి రోజు పన్నెండు పుష్కరాలు జరిగే నదుల నుంచి తీసుకువచ్చిన జలాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఐదు రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు జరగనున్నాయి.
● పార్వతీ సమేత కుండలేశ్వరుని దర్శనం అనంత కుండాల ఫలం. కుండలేశ్వరుని దర్శిస్తే నూరు గోవులను హత్య చేసిన పాపం నుంచి విముక్తి పొందుతారని భక్తుల నమ్మకం. భక్తులు కోరిన కోర్కెలు తీరుతాయని విశ్వాసం. కాట్రేనికోన మండలం కుండలేశ్వరంలో ఈ ఆలయం ఉంది.
ఆలయాల్లో ఏర్పాట్లు
జిల్లాలో జరిగే మహా శివరాత్రి పర్వదినానికి శైవ క్షేత్రా లు ముస్తాబవుతున్నాయి. ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే ఆలయాల వద్ద ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేశారు. పార్కింగ్కు, ఇతర సౌకర్యాలు, ఆలయాల వద్ద భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకునేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. తాగునీరు, చిన్న పిల్లలకు పాలు పట్టేందుకు ప్రత్యేక రూమ్లు, గోదావరి, సముద్ర స్నానాలు చేసేచోట రక్షణ చర్యలు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ఏర్పాట్లు చేశారు.
ఆకర్షించే శివైశిష్ట్యం


