పర్యవేక్షణ కొరవడి.. బాల్యం అవస్థలు పడి
ఫ కలుషిత ఆహారం తిని విద్యార్థులకు అస్వస్థత
ఫ దేవరపల్లి గిరిజన సంక్షేమ బాలుర
ఆశ్రమ పాఠశాలలో ఘటన
ఫ 88 మందికి ఆసుపత్రుల్లో చికిత్స
రంపచోడవరం: ఎన్నో ఆశలు, మరెన్నో కలలతో విద్యాబుద్ధులు నేర్చుకుంటున్న బాల్యంపై నిర్లక్ష్యం అలముకుంది.. వారికి వడ్డించే ఆహారం విషయంలోనూ పర్యవేక్షణ కొరవడింది.. ఏటా అనేక ఘటనలు జరుగుతున్నా అధికారుల్లో చలనం లేకుంది. మారేడుమిల్లి మండలం దేవరపల్లి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో 88 మంది విద్యార్థులకు శనివారం ఫుడ్ పాయిజన్ జరగడం అందుకు ఉదాహరణ. నిల్వ శెనగపిండితో బొంబాయి చట్నీ చేయడంతో అది తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. దేవరపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 277 మంది విద్యార్థులు ఉంటే, ఇందులో 88 మందికి ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఉదయం ఇడ్లీ, బొంబాయి చట్నీతో టిఫిన్ తిన్నారు. మధ్యాహ్నం భోజనం చేసిన కొద్ది నిమిషాల్లోనే విద్యార్థులకు కళ్లు తిరిగి వాంతులు కావడంతో 18 మందిని మారేడుమిల్లి పీహెచ్సీకి, 68 మంది రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సాయంత్రం ఏడు గంటలు తరువాత మరో ఇద్దరు అస్వస్థతకు గురికావడంతో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. బొరగా బుజ్జిబాబుదొర అనే విద్యార్థికి వాంతులతో పాటు శ్వాస సంబంధిత ఇబ్బంది కలగడంతో రాజమహేంద్రవరం ఆసుపత్రికి రిఫర్ చేశారు.
వైద్య చికిత్స దయనీయం : రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో విద్యార్థులు చికిత్స పొందుతున్న పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉందని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. ఒకే మంచంపై ఆరుగురు పిల్లలు పడుకుని సెలెన్లు పెట్టించుకునే దౌర్భగ్య పరిస్థితులు కనిపించాయని అన్నారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తరువాత గిరిజన సంక్షేమాన్ని గాలికొదిలేసిందని అన్నారు. రంపచోడవరం ప్రాంతంలోని పాఠశాలల్లో వరుసగా మరణాలు సంభవించాయని, అయినా స్పందన లేదన్నారు. మారేడుమిల్లి మండలంలో ఒక పాప తలకు దెబ్బతగిలి చనిపోయిందని, పోస్టుమార్టం రిపోర్టు ఇప్పటికీ వెల్లడించలేదన్నారు. గత వైఎస్సార్ ప్రభుత్వంలో పాఠశాలలు, ఆసుపత్రులు, గిరిజనుల వైద్యానికి పెద్దపీట వేశారని ధనలక్ష్మి అన్నారు. ప్రస్తుతం గిరిజన ప్రాంతం పట్ల ఆ శాఖ మంత్రి హేళనగా మాట్లాడడం దురదృష్టకరమన్నారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం కొనసాగితే ఐటీడీఏ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనపై పాఠశాల హెచ్ఎం సత్యనారాయణ, వార్డెన్ గణపతిలకు ఐటీడీఏ పీఓ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ఒకే మంచం.. ఐదుగురికి వైద్యం
రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి అస్వస్థతకు గురైన విద్యార్థులను తీసుకురావడంతో వారికి చికిత్స అందించేందుకు సరిపడా మంచాలు లేవు. దీంతో ఒకే మంచంపై నలుగురు నుంచి ఐదుగురిని పడుకోబెట్టి వైద్యం చేశారు. అస్వస్థతకు గురై నిరసంగా ఉన్న విద్యార్థులు ఆ మంచాలపైనే ఇబ్బందికరంగా కూర్చుని సైలెన్లు పెట్టించుకున్నా రు. రంపచోడవరం ఐటీడీఏ పీఓ బచ్చు స్మరణ్రాజ్ విద్యార్థులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించారు. ఏరి యా ఆసుపత్రిని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి విద్యార్థులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం ఆమె విలేకర్లుతో మాట్లాడా రు. అక్కడి నుంచి దేవరపల్లి ఆశ్రమ పాఠశాలకు వెళ్లారు.
పర్యవేక్షణ కొరవడి.. బాల్యం అవస్థలు పడి
పర్యవేక్షణ కొరవడి.. బాల్యం అవస్థలు పడి


