సీబీఐ క్లీన్చిట్ ఇచ్చినా ఆగని కుట్రలు
పి.గన్నవరం: తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు, చేపనూనె కలిసిందని కూటమి నేతలు చేసిన ప్రచారం నిజం కాదని సీబీఐ సిట్ క్లీన్చిట్ ఇచ్చిన నేపథ్యంలో.. ఈ దుష్ఫ్రచారానికి బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేయాలని కోరుతూ వైఎస్సార్ సీపీ నాయకులు మంగళవారం పి.గన్నవరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అలాగే ఒక పథకం ప్రకారం వైఎస్సార్ సీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై పెట్రోలు బాంబులు వేసి దగ్ధం చేసిన కూటమి పెద్దలపై కేసు నమోదు చేయాలని మరో ఫిర్యాదును ఎస్ఐ బి.శివకృష్ణకు అందజేశారు. అనంతరం స్టేషన్ బయట గన్నవరపు విలేకరులతో మాట్లాడారు. తిరుపతి లడ్డూపై కూటమి నేతలు చేసిన దుష్ఫ్రచారం నిజం కాదని తేలడంతో చంద్రబాబు ఉక్రోషంతో ప్రజల దృష్టిని మరల్చేందుకు మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు చేయిస్తున్నారని అన్నారు. పెట్రోల్ బాంబులతో ఇళ్లను దగ్ధం చేస్తూ దౌర్జన్యకాండ సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. తప్పుడు ఫ్లెక్సీలతో ప్రజల దృష్టిని మరల్చేందుకు కుట్రలు పన్నారన్నారు. ప్రశ్నించే వారిని అంతం చేయాలని కుట్ర చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఎంతటి దాడులు, దౌర్జన్యాలకు దిగినా భయపడేది లేదని హెచ్చరించారు. లడ్డూపై చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్కళ్యాణ్ చేసిన దుష్ఫ్రచారాన్ని దేశ ప్రజలు, ఆధ్యాత్మిక సంస్థల పెద్దలు గమనిస్తున్నారని అన్నారు. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారితో ఆటలాడవద్దని చంద్రబాబుకు హితవు పలికారు. మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి, ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యుడు బూడిద వరలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షుడు యన్నాబత్తుల ఆనంద్, కొమ్ముల రాము, విత్తనాల ఇంద్రశేఖర్, మట్టపర్తి శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు మందపాటి కిరణ్కుమార్, దొమ్మేటి వెంకట శివరామన్, కుడుపూడి విద్యాసాగర్, తోరం సూర్య భాస్కరరావు, వాసంశెట్టి తాతాజీ, నక్కా వెంకటేశ్వర రావు, దొమ్మేటి సత్యమోహన్, మిందగుదటి శిరీష్, పేరి శ్రీను పాల్గొన్నారు.


