లడ్డూపై కాలకూటమి
రామచంద్రపురం: తిరుమల లడ్డూ ప్రసాదంలో ఎటువంటి కల్తీ జరగలేదని సుప్రీంకోర్టులో సీబీఐ స్పష్టత ఇచ్చినప్పటికీ ఏవో కెమికల్స్ కలిపారని ఆధార రహితంగా కూటమి నేతలు తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు, ఆ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాశ్ మంగళవారం రామచంద్రపురం డీఎస్పీ బీ రఘువీర్కు ఫిర్యాదు చేశారు. ప్రశాంతంగా ఉండే రామచంద్రపురం నియోజకవర్గంలో ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎస్పీని కోరారు. సెక్షన్ 30 అమలులో ఉన్నప్పటికీ కె.గంగవరంలో టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్కు కూత వేటుదూరంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారని తెలిపారు. ఇటువంటి చర్యల మూలంగా తమ పార్టీ తరఫున ప్రతి చర్యలకు దిగాల్సిన పరిస్థితులను కల్పించవద్దని డీఎస్పీకి వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల్ని కాపాడవలసిన ముఖ్యమంత్రి, ఇతర కూటమి నేతలు రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తున్నారన్నారు. మాజీ మంత్రులు, అంబటి రాంబాబు, జోగి రమేష్ల ఇళ్లపై దాడులు హేయమైన చర్యలుగా ఖండించారు. పార్టీ కన్వీనర్లు గాధంశెట్టి శ్రీధర్, పెట్టా శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ శాఖా బాబీ, మున్సిపల్ కౌన్సిలర్ వాడ్రేవు సాయిప్రసాద్, నేతలు పెంటపాటి శ్రీను, పోతంశెట్టి గోపాలకృష్ణ, సత్తిశఽంకర్రెడ్డి, మల్లిడి సత్తిరెడ్డి పాల్గొన్నారు.
తిరుమల వేంకటేశ్వరస్వామి లడ్డూపై
అడ్డగోలుగా విషం కక్కుతున్న కూటమి నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్ సీపీ నాయకులు జిల్లా వ్యాప్తంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. లడ్డూలో జంతువుల కొవ్వు, చేప నూనె కలవలేదని సుప్రీంకోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో సీబీఐ విస్పష్టంగా పేర్కొన్నా కావాలనే వారు దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. స్వామివారి ప్రసాదం పవిత్రతపై అనుమానం కలిగేలా, కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా సాగుతున్న ఫ్లెక్సీల ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని ఆ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.


