ఎమ్మెల్యేలు ప్రజా విశ్వాసం కోల్పోయారు
– కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం
అమలాపురం రూరల్: చంద్రబాబు ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, ఇసుక మట్టి, మద్యం, మాఫియాతో అవినీతికి పాల్పడుతూ ప్రజల విశ్వాసం కోల్పోయారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు జేడీ శీలం ఆరోపించారు. అమలాపురంలో గురువారం జరిగిన డీసీసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు నమ్మి ఓట్లు వేశారని వారిని ప్రభుత్వం పట్టించుకోపోవడంతో ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కోఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. జాతీయ గ్రామీణ ఉపాధి పధకానికి ఉన్న మహాత్మాగాంధీని పేరును కేంద్ర ప్రభుత్వం తొలగించి వీబీసీ రాంజీ అని పేరును పెట్టడం దారుణమని సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు ఆవేదన వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్షుడు కొత్తూరి శ్రీనివాస్, ఏఐసీసీ మెంబర్ యార్లగడ్డ రవీంద్ర, పట్టణ అధ్యక్షుడు ఒంటెద్దు బాబి పాల్గొన్నారు.


