పారదర్శకంగా జనాభా లెక్కలు
అమలాపురం రూరల్: జనాభా లెక్కలు పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో 2027 జనాభా లెక్కల సేకరణపై వారికి విధివిధానాలు వివరించారు. వివరాల నమోదుపై ఎన్యుమరేటర్లకు, సూపర్వైజర్లకు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఈ మేరకు శిక్షణ ఇవ్వాలన్నారు. మొబైల్ యాప్లు, ఆన్లైన్ పోర్టల్ ద్వారా డిజిటల్ విధానంలో మొదటి సారిగా సమగ్ర కుల గణన చేస్తున్నారన్నారు. మొదటి దశలో ఇళ్లు, రెండో దశలో జనాభా గణన, తద్వారా కులాల వారీగా సమగ్ర వివరాలు సేకరిస్తున్నట్టు తెలిపారు. ఆ గణాంకాలను అనుసరించి అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల సీట్ల సర్దుబాట్లు ఉంటాయన్నారు. సమావేశంలో ఎస్పీ రాహుల్ మీనా, డీఆర్వో కె.మాధవి, ఆర్డీఓలు పి.శ్రీకర్, దేవరకొండ అఖిల, సీపీఓ మురళీకృష్ణ పాల్గొన్నారు.
అధికారులకు అభినందనలు
జిల్లాలో ఇటీవల నిర్వహించిన డ్రాగన్ పడవల పోటీలు, జగ్గన్నతోట తీర్థం, అంతర్వేది లక్ష్మీనరసింహుని ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించిన అధికారులను కలెక్టర్ అభినందించారు. శుక్రవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఈ నెల 15న జిల్లా వ్యాప్తంగా 6 ప్రాంతాలలో నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవ ఏర్పాట్లలపై సమీక్షించారు. పోలీస్ రెవెన్యూ దేవదాయ, ధర్మదాయ శాఖలు భక్తులకు అన్ని విధాలా సహకరించాలని, ప్రొటోకాల్ నిబంధనలను పాటించాలని సూచించారు. డీఎస్పీలు మురళీమోహన్ టీఆర్ఎస్కే ప్రసాద్, జిల్లా అగ్నిమాపక అధికారి పార్థసారధి పాల్గొన్నారు.


