రోడ్డు ప్రమాదంలో వ్యక్తిమృతి
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా మాత్తిలి సమితి ఉదులిబేఢ గ్రామం సమీపంలో శనివారం ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం చెందగా, మరొకరు గాయపడ్డారు. మల్కన్గిరి నుంచి జయపూర్ను కలిపే 326 జాతీయ రహదరిపై జిల్లా కేంద్రం నుంచి గోవిందపల్లి వైపు వెళ్తున్న చిప్స్ లోడుతో ఉన్న టిప్పర్ వాహనం ఉదులిబేఢ సమీపంలో మోటర్ సైకిల్పై వెళ్తున్న వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై ఉన్న కేశవ్ గౌడ్ (29) అక్కడికక్కడే మృతి చెందాడు. కేశవ్ రోజు కూలీగా పని చేస్తున్నాడు. ఈయన మృతితో కుటుంబం రోడ్డున పడింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న మాత్తిలి ఐఐసీ దీపాంజలి ప్రధన్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి టిప్పర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం మాత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆదివారం ఉదయం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు.


