మొబైల్ నెట్వర్క్ సౌకర్యాన్ని కల్పించాలి
జయపురం: కొరాపుట్, రాయగడ జిల్లాల్లోని పలు ప్రాంతాలకు 4జీ మొబైల్ నెట్వర్క్ సౌకర్యాన్ని కల్పించాలని కొరాపుట్ పార్లమెంట్ సభ్యుడు సప్తగిరి శంకర ఉల్క విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు న్యూఢిల్లీలో కేంద్ర సంచార మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. కొరాపుట్, రాయగడ జిల్లాల్లోని అనేక ప్రాంతాలకు నేటికీ మొబైల్ నెట్వర్క్ సేవలు అందడం లేదని తెలిపారు. దీంతో ఆదివాసీ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు అత్యవసర పరిస్థితిలోనూ వైద్య సేవలు, విద్య, బ్యాంకింగ్ తదితర సేవలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వాలు స్పందించి నెట్వర్క్ సదుపాయం కల్పిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
విద్యార్థులకు
బహుమతులు అందజేత
జయపురం: బొయిపరిగుడ సమితిలోని సాహిద్ లక్ష్మణ నాయిక్ డిగ్రీ కళాశాల, ఉన్నత మాధ్యమిక విద్యాలయంలో గతంలో నిర్వహించిన హిందీ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను బుధవారం అందజేశారు. స్వచ్ఛాసేవి సంస్థ, ఖాదీ గ్రామోద్యోగ అయోగ్లు సంయుక్తంగా ఈ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో బొయిపరిగుడ స్వచ్ఛంద సంస్థ సెడా కార్యదర్శి మురళీధర్ బరడ, సమితి విద్యాధికారి సుసాంత కుమార్ కడమ్, సాహిద్ లక్ష్మణ నాయిక్ ఉన్నత మాధ్యమిక విద్యాలయ పరిచాలన కమిటీ అధ్యక్షుడు కుముద్ రంజన్ మహరాణ, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ స్నేహలత పట్నాయిక్ తదితరులు పాల్గొన్నారు.
ఘంటసాలకు నివాళి
పర్లాకిమిడి: గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు 52వ వర్ధంతి సభను పర్లాకిమిడి చైతన్య ఆంధ్ర సాహితీ సంస్కృతి సమితి ఆధ్వర్యంలో పాతపట్నం రోడ్డులో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఘంటసాల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు చలన చిత్ర రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో చైతన్య సమితి సభ్యుడు పారిశెల్లి రామరాజు (పాతపట్నం), కార్యదర్శి బర్నాల జనార్ధనరావు, అధ్యక్షుడు కె.ఆనందరావు, అంపోలు శ్రీను, ఎస్.ఎన్.పండా తదితరులు పాల్గొన్నారు.
రాయగడ: గాన గంధర్వుడు ఘంటసాల సినీ జగతికి ఆశాదీపమని ప్రముఖ కవి, రచయిత, సీనియర్ పాత్రికేయులు భళ్లమూడి నాగరాజు అన్నారు. స్థానిక స్పందన సాహితీ, సాంసృతిక సంస్థ ఆధ్వర్యంలో రామలింగేశ్వర మందిరం ప్రాంగణంలో బుధవారం ఘంటసాల వర్ధంతి సభను నిర్వహించారు. అంతకుముందు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో స్పందన సంస్థ సాంస్కృతిక విభాగం కార్యదర్శి కేకే ఎం.పట్నాయక్, సహ కార్యదర్శి బాలకృష్ణ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మొబైల్ నెట్వర్క్ సౌకర్యాన్ని కల్పించాలి
మొబైల్ నెట్వర్క్ సౌకర్యాన్ని కల్పించాలి


