జయపురం: పట్టణ పోలీసుస్టేషన్ సభాగృహంలో అమ పోలీస్ సమితి(మన పోలీసు సమితి) సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. వృద్ధుల భద్రత, ట్రాఫిక్ సమస్యలు, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే డ్రైవర్లపై చర్యలు, రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ తదితర విషయాలపై చర్చించారు. సమావేశంలో జయపురం మున్సిపల్ చైర్మన్ నరేంద్రకుమార్ మహంతి, వైస్ చైర్పర్సన్ బి.సునీత, జయపురం సబ్ డివిజనల్ పోలీసు అధికారి అర్చిత మిత్తల్, పట్టణ పోలీసు అధికారి ఉల్లాష్ చంద్రరౌత్, న్యాయవాదుల సంఘ జయపురం అధ్యక్షుడు బిజయరాయ్ జనాదేవ్, ఉపాధ్యక్షుడు శరత్ కుమార్ మఝి, కార్యదర్శి సహదేవ్ పట్నాయిక్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజాహిత కార్యక్రమాలకే పెద్దపీట
జయపురం: పట్టణంలో ప్రజాహిత కార్యక్రమాలకు సీవా స్వచ్ఛంద సంస్థ పెద్దపీట వేస్తుందని జయపురం సోషియల్ ఎడ్యుకేషనల్ ఎన్విరాన్మెంటల్ వెల్ఫేర్ అసోసియేషన్ (సీవా) అధ్యక్షుడు అజయ కుమార్ మిశ్ర అన్నారు. ఆ సంస్థ నూతన కార్యవర్గ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికై న అధ్యక్షుడు అజయ్ కుమార్ మిశ్ర, కార్యదర్శి ప్రతాప్ కుమార్ పట్నాయిక్, కోశాధికారి రంజిత్ కుమార్ నాయిక్, ఉపాధ్యక్షుడు జి.వెంకటరెడ్డి, సహాయ కార్యదర్శి కె.కృష్ణారావులు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు అజయ్ కుమార్ మిశ్ర మాట్లాడుతూ.. ఈనెల 19వ తేదీన రక్తదానం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు.
జిల్లా విద్యాశాఖాధికారిగా భజన్లాల్
రాయగడ: జిల్లా అదనపు విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న భజన్లాల్ మాఝి జిల్లా విద్యాశాఖ అధికారి అదనపు బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు జిల్లా విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వహించిన రామచంద్ర నాహక్ పదవీ కాలం పూర్తవ్వడంతో పదవీ విరమణ చేశారు. ఈ మేరకు శుక్రవారం భజన్లాల్ జిల్లా కలక్టర్ అశుతోష్ కులకర్ణిని కలిసి బాధ్యతలు స్వీకరించారు. పలువురు సిబ్బంది అభినందించారు.
మినీ లారీ బోల్తా.. మహిళ మృతి
రాయగడ : బియ్యం లోడుతో వస్తున్న మినీ లారీ బోల్తా పడిన ఘటనలో ఒక మహిళ మృతి చెందగా మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. జిల్లాలోని కొలనార సమితి బఘుడి ఘాటీ మలుపు వద్ద గురువారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా క్షతగాత్రులను చికిత్స కోసం తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. జిల్లాలొని బిసంకటక్ నుంచి బియ్యం లోడుతో మినీ లారీ బరంపురానికి వెళుతున్న సమయంలో కొలనార సమితి బఘుడి ఘాటి మలుపులో లారీ అదుపు తప్పి బోల్తా పడింది. లారీలొ ప్రయాణిస్తున్న భార్యాభర్తల్లో భార్య తీవ్ర గాయాలకు గురై సంఘటన స్థలం వద్దే మృతి చెందగా ఆమె భర్త, లారీ డ్రైవర్ గాయాలతో బయటపడ్డారు.


