పర్లాకిమిడి: గజపతి జిల్లా నుంచి అక్రమంగా తరలిస్తున్న గంజాయిని అరికట్టేందుకు ఆర్.ఉదయగిరి పోలీసులు, అబ్కారీ సిబ్బంది ముమ్మరంగా నిన్నటి నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఆర్.ఉదయగిరి పీఎస్ పరిధిలో నువాగడ సమితి సుందర్డంగ్ పంచాయతీ బురిపోదర్ గ్రామంలో గురువారం తనిఖీలు నిర్వహించి అధిక మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్డీపీఓ రాకేష్కుమార్ తెలిపిన వివరాలు ప్రకారం గ్రామంలో అక్రమంగా గంజాయి నిల్వలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారంతో బురిపదర్ గ్రామంలో ఇళ్లు, పశువుల శాలలు, అటవీ ప్రాంతంలో తనిఖీలు చేపట్టి సుమారు 1,830 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మార్కెట్లో సుమారు ఒకకోటి 80 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి ముగ్గురు గుర్తుతెలియని నిందితులు తప్పించుకుని పారిపోయారని పోలీసు అధికారి రాకేష్ సాహు తెలిపారు. వారికోసం గాలిస్తున్నామని ఆయన తెలియజేశారు.


