ఆధ్యాత్మిక విలువలపై బోధన
జయపురం: స్థానిక సామాజిక సంస్థ సోషియల్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ అసోషియేషన్(సీవా) ఆధ్వర్యంలో జయపురం సిటీ ఉన్నత పాఠవాలలో ఆధ్యాత్మిక సెమినార్ను ఆదివారం నిర్వహించారు. సీవా సీనియర్ సభ్యులు విశ్రాంత వ్యవసాయ అధికారి జి.వెంకట రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆధ్యాత్మిక చైతన్యం, నైతిక విలువలు పెంపొందించటమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ప్రారంభించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు భారతీయ సంస్కృతి, మానవత్వం, నైతిక విలువలపై బోధించారు. శ్రీమద్భగవద్గీత శ్లోకాలు మానవ విలువలు, రామాయణం, మహాభారతం తదితర అంశాలపై క్విజ్ నిర్వహించారు. సీవా మాజీ కార్యదర్శి, సిటీ ఉన్నత పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు ప్రతాప్ కుమార్ పట్నాయిక్ కృషి, సహకారాలతో సెమినార్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.


