పశ్చిమ బెంగాల్ దంపతులకు మగశిశువు దత్తత
పర్లాకిమిడి: పశ్చిమ బెంగాల్ దంపతులకు గజపతి జిల్లా రెవెన్యూ ఏడీఎం మునీంద్ర హానగ బుధవారం ఒక మగశిశువును దత్తత నిమిత్తం అందజేశారు. ఇప్పటివరకూ 76 మంది శిశువులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దత్తత నిమిత్తం జిల్లా నుంచి అందజేశారు. ఒక అవివాహిత ఈ శిశువుకు జన్మనిచ్చి పెంచలేక ప్రభుత్వ చైల్డ్ ప్రోటెక్షన్ యూనిట్కు అందజేసింది. తదనంతరం కలెక్టర్ ఆదేశాల మేరకు కాశీనగర్ బ్లాక్ రాణిపేట గ్రామంలో పౌష్యసంతాన కేంద్రం నిస్సాన్ సలోంకు పంపి ఆలనపాలన చూశారు. సంతానం లేని పశ్చిమ బెంగాల్ దంపతులు నాలుగేళ్ల కిందట పోర్టల్లో దరఖాస్తు చేసుకున్నారు. బుధవారం వారికి చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, సంతాన దత్తత కేంద్రం (రాణిపేట) అధికారులు సమక్షంలో ఏడీఎం మునీంద్ర బిడ్డను అందజేశారు. బిడ్డను చేరదీసి అందుకున్న ఆ తల్లి కన్నీళ్లు కార్చింది. బిడ్డ అప్పగింతలో డీసీపీయూ అరుణ్ కుమార్ త్రిపాఠి, ప్రత్యూష్ కుమార్ సూర్య, శిశుసంక్షేమ సమితి చైర్మన్ అశ్వినీ కుమార్ మహాపాత్రో తదితరులు పాల్గొన్నారు.


