పోరాటంతోనే నాయకత్వం
● గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి
భువనేశ్వర్: పోరాటాలతో నాయకత్వం రూపుదిద్దుకుంటుందని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి అన్నారు. స్వాతంత్య్ర సమర యోధుడు పవిత్రమోహన్ ప్రధాన్ జీవిత విశేషాల్ని ఉటంకిస్తూ ఈ విషయం తెలిపారు. పవిత్రమోహన్ ప్రధాన్ 118వ జయంతి సందర్భంగా అంగుల్ జిల్లా కణిహా మండలం పవిత్ర నగర్లో ఆదివారం జరిగిన బహిరంగ సభలో గవర్నర్ ప్రసంగించారు. స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి దివంగత పవిత్ర మోహన్ ప్రధాన్ విగ్రహం ఆవిష్కరణ, మ్యూజియం ప్రారంభోత్సవంలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాంతంలో పలు మౌలిక సదుపాయాలు, అభివృది్ధ్ ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు శంకుస్థాపనలు చేశారు. కొత్తగా ప్రారంభించిన శంకుస్థాపన విగ్రహం, మ్యూజియం స్మారక చిహ్నాలు, ప్రజాసేవ, సామాజిక పరివర్తనకు అంకితమైన జీవితానికి సజీవ చిహ్నాలని గవర్నర్ పేర్కొన్నారు. ధైర్యం, నిజాయితీ, త్యాగం, సమాజం పట్ల నిబద్ధత వంటి విలువలను పరిరక్షణ ప్రతిబింబంగా ఈ మ్యూజియం భావితరాలకు విద్యా కేంద్రంగా ఆవిర్భస్తుందన్నారు. పవిత్రమోహన్ ప్రధాన్ ఉద్యమ జీవితంలో గర్జత్ పాలకుడి అణచివేత పాలనకు వ్యతిరేకంగా తాల్చేర్ ప్రజా మండల్ ఉద్యమం, హిజ్రత్ సామూహిక నిరసన చారిత్రాత్మక మైలురాళ్లుగా నిలిచిపోయాయన్నారు. ఈ పోరాటాలు నిరంకుశ పాలనను అంతమొందించి తాల్చేర్ను ప్రజాస్వామ్య ఒడిశాలో విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించాయన్నారు. స్వాతంత్య్రం తరువాత పవిత్ర మోహన్ ప్రధాన్ శాసన సభ్యుడిగా, మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ప్రజలతో మంచి సంబంధాలను కొనసాగిస్తూనే తన ప్రజా సేవను కొనసాగించడం ఆదర్శప్రాయమైన నాయకత్వ ధీరత్వానికి నిలువెత్తు తార్కాణమన్నారు. విద్యా రంగంలో ఆయన సేవలు ప్రగతిశీల, విజ్ఞానవంతమైన, సాధికారత కలిగిన ఒడిశాకు పునాది వేశాయన్నారు. ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ దివంగత పవిత్ర మోహన్ ప్రధాన్ ఈ నేల యొక్క గర్వం, గౌరవం, ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. ఆయన తరతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారన్నారు. పోరాట జీవితం, రాజకీయ ప్రస్థానం, విద్యా రంగం పురోగతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. ఢెంకనాల్ లోక్సభ సభ్యుడు రుద్ర నారాయణ్ పాణి, ఎమ్మెల్యే అశోక్ మహంతి, కలెక్టర్ ముహమ్మద్ అబ్దుల్ అక్తర్ ప్రసంగించారు.
పోరాటంతోనే నాయకత్వం


