రైతు సమస్యలపై బీజేడీ శ్రేణుల ఆందోళన
రాయగడ: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని బీజేడీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జగన్నాథ సరక ఆద్వర్యంలో స్తానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మంగళవారం పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ముందుగా స్థానిక కపిలాస్ కూడలి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేసి అక్కడ ఆందోళన చేపట్టారు. రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నాయకులు ధ్వజమెత్తారు. రైతులు ఈ ఏడాది ఖరీప్ సీజన్లో ధాన్యం క్రయవిక్రయాలకు సంబంధించి పడుతున్న పాట్లు అంతాఇంతా కాదని జగన్నాథ సరక అన్నారు. టోకెన్ల మంజూరు విషయంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించడంతో ఇప్పటికీ మండీల్లో ధాన్యం పడి ఉన్నాయని అన్నారు. రైతులను అన్నివిధాలుగా ఆదుకుంటున్నామని చెబుతున్న బీజేపీ ప్రభుత్వం ఆ దిశగా కృషి చేయడం లేదని ఆరోపించారు. బిజేపీ హయాంలో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం చివరకు అమ్ముకునేందుకు కూడా అవకాశం కల్పించలేని ప్రభుత్వం ఉన్నా లేకపొయినట్లేనని అన్నారు. ఇదిలాఉండగా ఇచ్చిన హామీలు గాలికి వదిలేసిన ప్రభుత్వం ప్రజలతో చెలగాటమాడుతోందని అన్నారు. అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన బీజేపీకి ప్రజలు రానున్న కాలంలో ప్రజలు బుద్ధి చెప్పక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టి ప్రజల భద్రతను మరిచారని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని సరక అన్నారు. ప్రజలకు మాయ మాటలు చెప్పి వారిని నట్టేటా ముంచివేసిందని అన్నారు. అనంతరం సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిప్యూటీ కలెక్టర్ లిజారౌత్కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఆందోళన కార్యక్రమంలో బీజేడీ పార్టీ సీనియర్ నాయకుడు, జిల్లా మాజీ అధ్యక్షుడు సుధీర్ దాస్, ఉపాధ్యక్షుడు పట్నాన గౌరీశంకరరావు, దేవాషీశ్ ఖడంగ, రాయగడ మున్సిపల్ వైస్ చైర్మన్ శుభ్ర పండ, జగదీష్ పాత్రో, అనసూయా మాఝి పాల్గొన్నారు.
రైతు సమస్యలపై బీజేడీ శ్రేణుల ఆందోళన


