ముగిసిన సాంస్కృతిక పోటీలు
ఆదివాసీ జానపద నృత్యం చేస్తున్న విద్యార్థులు
జయపురం: విక్రమదేవ్ విశ్వ విద్యాలయం (జయపురం) ఆధ్యర్యంలో నిర్వహించిన ఇంటర్ కళాశాలల స్థాయి సాహిత్య, సాంస్కృతిక పోటీలు–2026 సోమవారం రాత్రితో ముగిశాయి. విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల విద్యార్థులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. యువతలో సృజనాత్మకత, ప్రతిభ, సాంస్కృతిక సమన్వయాన్ని ప్రోత్సహించేందుకు ఈ పోటీలు నిర్వహించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. సంగీతం, నృత్య విభాగాలలో పోటీలు నిర్వహించారు. సంగీత పోటీల్లో క్లాసికల్, ఓకల్(సోలో), లైట్ ఓకల్(సోలో), ఇన్స్ట్రమెంటల్ మ్యూజిక్ (సోలో) విభాగాలలో నిర్వహించిన పోటీలలో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా జయపురం విక్రమదేవ్ విశ్వవిద్యాలయ రాజకీయ విజ్ఞాన విభాగాధిపతి మహేశ్వర్ దురియ, ఆల్ ఇండియా రేడియో జయపురం ఏ–గ్రేడ్ కళాకారుడు సనాతన్ పురోహిత్ దాస్, సమాజ శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సాగరిక మిశ్ర, బీఈడీ అధ్యాపకురాలు కస్తూరీ ఆచార్య, రసాయనిక శాస్త్ర విభాగ అధ్యాపకులు డాక్టర్ స్మిత సాగర్ శతపతి వ్యవహరించారు. నృత్య పోటీలలో క్లాసికల్ డాన్స్, కంటెంపరరీ డాన్స్, జానపద నృత్యాలు నిర్వహించారు. ఈ నృత్య పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఒడియా విభాగ సహాయ అధ్యాపకురాలు సుకాంతి సోయ్, ఒడియా విభాగ ప్రభుత్వ అధ్యాపకులు సంతోషిణి, జయపురం కళాకారుడు వై.గౌరీశంకర్ వ్యవహరించారు. ముఖ్యఅతిథిగా విక్రమదేవ్ యూనివర్సిటీ జయపురం రిజిస్ట్రార్ మహేశ్వర్ చంద్ర నాయక్ పాల్గొన్నారు. శని, ఆది, సోమవారాల్లో జరిగిన ఈ పోటీలతో విశ్వవిద్యాలయంలో పండగ వాతావరణం నెలకొంది.
ముగిసిన సాంస్కృతిక పోటీలు


