లింగరాజ ఆలయం
న్యూస్రీల్
ఆదివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
కళకళలాడుతున్న..
● మహా శివరాత్రికి ప్రత్యేక ఏర్పాట్లు
విద్యార్థినుల ఆగ్రహం
జయపురం: జయపురం విక్రమదేవ్ కళాశాలలో+3 (డిగ్రీ) చదువుతున్న విద్యార్థినులు ఏకమై కళాశాల యాజమన్యం వ్యవహరిస్తున్న తీరుపై శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పరీక్ష పేపర్ల ఫలితాలను చాలాకాలంగా వెల్లడించలేదని ఆరోపించారు. కళాశాల అధికారులు ప్రశ్నా పత్రాల విధానం ఎలా ఉండబోతుందో స్పష్టత ఇవ్వడం లేదని, అలాగే సరైన సిలబస్ అందించకపోవడంతోపాటు అనేక సమస్యలు ఎదుర్కుంటున్నామని మండిపడ్డారు. వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలంగా విశ్వవిద్యాలయ అనుబంధంగా కళాశాల ఉన్నప్పటికీ నేటికీ పరీక్షలు సక్రమంగా నిర్వహించక పోవటం ఏమిటని కళాశాల అధికారులను నిలదీశారు. అనంతరం విద్యార్థినులంతా భారీ ర్యాలీ నిర్వహించారు.
సేవ పరమ ధర్మం: గవర్నర్
భువనేశ్వర్: నిజమైన గొప్పతనం మనం మన కోసం ఏం సాధిస్తామో దానిలో కాదు, ఇతరుల కోసం మనం ఏం చేస్తామో దానిలో ఉందని రాష్ట్ర గవర్నర్ హితవు పలికారు. అర్గూస్ వార్తా సంస్థ నిర్వహించిన ప్రైడ్ ఆఫ్ ఒడిశా సమ్మాన్ ఉత్సవ్ – సీజన్ 2.0లో ఆయన శనివారం ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధైర్యం, కరుణ, నిబద్ధత ద్వారా సమాజాన్ని మార్చిన వ్యక్తులను గుర్తించే అర్థవంతమైన చొరవగా ఈ కార్యక్రమాన్ని అభివర్ణించారు. ఈ కార్యక్రమం ఒడిశా ఆత్మను బలోపేతం చేసిన నిశ్శబ్ధ మార్పు సృష్టికర్తలకు నివాళిగా పేర్కొన్నారు. వార్త సేకరణ, ప్రసారంలో అసాధారణ సహకారం అందజేసే క్షేత్ర స్థాయి సిబ్బందిని సత్కరించడం మీడియా పారదర్శక పోకడకు శక్తివంతమైన సాధనంగా ఉండగలదన్నారు. కార్యక్రమంలో అర్గూస్ న్యూస్ సీఈఓ ప్రకాష్ సాహు, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దుర్గాశిష్ ప్రసంగించారు, వార్తలు, కథనాల సేకరణ, ప్రసారం రంగాల్లో విశేష ప్రతిభ ప్రదర్శించిన పాత్రికేయ వర్గాలను ఈ కార్యక్రమంలో సత్కరించారు.
విద్యుత్ షాక్తో యువకుడికి గాయాలు
రాయగడ: విద్యుత్ షాక్తో యువకుడు గాయాలు పాలైన ఘటన జిల్లాలోని కల్యాణ సింగుపూర్ సమితి ధమునిపొంగ పంచాయతీలోని పురుణాభట్ట గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గాయాలైన వ్యక్తి సుశాంత కాశీగా గుర్తించారు. వెంటనే అతడిని కల్యాణ సింగుపూర్లోని సీహెచ్సీకి చికిత్స కోసం తరలించారు. సమితిలోని ధమునిపొంగ పంచాయతీ కొత్తగుడ గ్రామానికి చెందిన సుశాంత్ అనే యువకుడు పురుణాభట్ట గ్రామంలోని ఒకరి ఇంటిపై పనిచేస్తున్న సమయంలో అదే ఇంటిపై నుంచి వెళ్లే ఒక విద్యుత్ వైర్కు తాకడంతో షాక్కు గురై కిందపడిపోయాడు. దీంతో అతడికి గాయాలయ్యాయి. అక్కడివారు వెంటనే అతడిని హాస్పిటల్కు తరలించారు.
భువనేశ్వర్: స్థానిక ఏకామ్ర క్షేత్ర ఆరాధ్య దైవం మహా ప్రభువు లింగరాజ్ ఆలయంలో మహా శివరాత్రి వేడుకల సన్నాహాలు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. ఈ వేడుకలు శాంతియుతంగా, సజావుగా నిర్వహించేందుకు స్థానిక పాలన అధికార యంత్రాంగం మరియు కమిషనరేట్ పోలీసులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సన్నాహాలలో భాగంగా కమిషనరేట్ పోలీసులు ఉన్నత స్థాయి సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లా యంత్రాంగం, కమిషనరేట్ పోలీసులు, లింగరాజ్ ఆలయ ట్రస్ట్ ప్రముఖులు, సేవాయత్లు (ఆలయ సేవకులు), వివిధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రముఖ శైవ తీర్థయాత్ర కేంద్రాలలో ఒకటైన లింగరాజ్ ఆలయంలో జాగర రాత్రి వేడుకల యొక్క అన్ని అంశాలకు సంబంధించి వివరణాత్మక చర్చలు జరిగాయి. భువనేశ్వర్, కటక్ జంట నగరాల పోలీస్ కమిషనర్ ఎస్.దేవదత్త సింగ్, భువనేశ్వర్ డీసీపీ జగమోహన్ మీనా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సురేష్ కుమార్ రౌత్రాయ్, బాబూ సింగ్, సమీర్ మహంతి, కార్పొరేటర్ బిరాంచి మహాసూపకర్ వంటి స్థానిక నాయకులు కూడా హాజరయ్యారు. సంప్రదాయం ప్రకారం ఆచారాలు అంతరాయం లేకుండా జరిగేలా చూసేందుకు అధికారులు సేవాయత్లతో విస్తృతంగా చర్చించారు.
ప్రధానంగా మహా దీప దర్శనం కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఈ సందర్భంగా వివిధ సంస్థల మధ్య సమన్వయంతో ఆలయ సముదాయంలో రద్దీ నియంత్రణ వంటి ముఖ్యమైన అంశాలపై చర్చించారు. శాంతిభద్రతల పరిరక్షణ, అవాంఛనీయ సంఘటనల నివారణ, సకాలంలో మహా శివ రాత్రి ప్రత్యేక పూజాదుల నిర్వహణకు ప్రాధాన్యత కల్పించారు.
ఉత్సవాల సమయంలో అనుబంధ వర్గాలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరారు. భక్తులకు క్రమబద్ధమైన క్యూ దర్శనం, అవసరమైన చోట పాస్ వ్యవస్థను అమలు మరియు మెరుగైన రద్దీ నిర్వహణపై దృష్టి సారించాలని కోరారు. జాగారం రాత్రి భారీ సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉన్నందున భక్తుల సౌకర్యాలు, భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించి రద్దీ నివారణకు ప్రత్యేక పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేశారు. ఉత్సవం పురస్కరించుకుని లింగరాజు ఆలయం పరిసరాల్లో వాహనాల రవాణా నిబంధనలను జారీ చేశారు. ఆలయం అనుసంధాన మార్గాల గుండా వాహనాల రాకపోకల్ని మల్లించారు. ఈ మేరకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. అన్ని విభాగాల సమగ్ర ప్రణాళిక మరియు సమన్వయ ప్రయత్నాలతో చారిత్రాత్మక లింగరాజ ఆలయంలో మహా శివరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధలతో ప్రశాంతమైన ఆధ్యాత్మిక క్రమశిక్షణతో జరిగేలా జాగ్రత్త వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
శివరాత్రికి ముస్తాబు
పర్లాకిమిడి: తెలుగు సొండివీధి వద్ద బలుంకేశ్వరీ స్వామి మందిరం శివరాత్రి పర్వదినానికి ముస్తాబవుతోంది. అతి పురాతన బలుంకేశ్వర స్వామి దర్శనం ఆదివారం వేకువజామున 3 గంటల నుంచి ప్రారంభమవుతుందని ప్రధాన పూజారి తెలియజేశారు. బలుంకేశ్వరీ స్వామి మందిరం వద్ద పుష్కరిణీ గతంలో పర్లాకిమిడి పురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి పుణరుద్ధరణ చేస్తామని చెప్పి ఏడాదైనా ఇంతవరకూ పనులు జరగలేదనే కారణంగా ఆలయ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఆ తర్వాత ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి కూడా బలుంకేశ్వర స్వామి పుష్కరిణీ సందర్శించి పుణరుద్ధరణకు తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. కానీ ఇంతవరకూ జరుగపోవడంతో పూజారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శివరాత్రి పర్వదినం నాడు రాత్రి పది గంటల సమయంలో బలుంకేశ్వర స్వామికి లింగాభరణం చేపడతామని పూజారులు తెలియజేశారు.
లింగరాజ ఆలయం
లింగరాజ ఆలయం
లింగరాజ ఆలయం
లింగరాజ ఆలయం
లింగరాజ ఆలయం
లింగరాజ ఆలయం


