ఆటో బోల్తా
● పలువురికి గాయాలు
టెక్కలి రూరల్: సంతబొమ్మాళి మండలంలోని వడ్డితాండ్ర గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఆటోలో మహేంద్రగిరి దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా, ఒడిశా రాష్ట్రం గారబంద వద్ద ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో సంతబొమ్మాళి మండలంలోని వడ్డితాండ్రకి చెందిన ఎన్.వాసు, ఎన్.శాంతి, ఎన్.లక్ష్మి, ఎల్.ధనలక్ష్మితో పాటు కొత్తూరుకు చెందిన ఎ.హీరమ్మ గాయపడ్డారు. గాయపడిన వారిని ఆటోలో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి ఆధారంగా మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్కు తరలించనున్నట్లు వైద్యులు తెలిపారు.
సౌండ్ సిస్టం సామగ్రి దగ్ధం
సంతబొమ్మాళి: మండలంలోని కొల్లిపాడు గ్రామంలో దూపాన భాస్కరరావుకు చెందిన సౌండ్ సిస్టం సామగ్రి దగ్ధమయ్యాయి. గ్రామంలోని ఒక ఇంట్లో ఈ సామగ్రి ఉండగా.. శనివారం అర్ధరాత్రి సమయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దాదాపు రూ.20 లక్షల నష్టం వచ్చినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు. కాగా ప్రమాదానికి గల కారణం తెలియలేదు.
తేనెటీగల దాడిలో
పలువురికి గాయాలు
టెక్కలి రూరల్: మండలంలోని అయోధ్యపురం పంచాయతీ పరిధి చొంపాపురం గ్రామ సమీపంలో ఉన్న గెడ్డ వద్ద ఆదివారం తేనెటీగలు దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. చొంపాపురం గ్రామానికి చెందిన పి.రంగారావు, పి.రాంప్రసాద్లు గ్రామ సమీపంలోని గెడ్డ వద్దకు వ్యక్తిగత పనులు నిమిత్తం వెళ్లారు. అయితే అదే సమయంలో అక్కడ చెట్టుపైనున్న తేనెపట్టు ఒక్కసారిగా కదలడంతో తేనెటీగలు ఇరువురిపై దాడి చేశాయి. అలాగే అదే సమయంలో అటుగా గుడి నుంచి వస్తున్న ఎస్.ఆదిలక్ష్మిపై సైతం దాడి చేశాయి. అలానే కొంతదూరంలో ఉన్న వృద్ధుడు ఎన్.సోమేశ్వరరావుతో పాటుగా డి.ముకుంద అనే వ్యక్తిపై సైతం దాడి చేశాయి. దీంతో గాయపడిన వారిని హుటాహూటీన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించారు.
బస్సు బోల్తా...
ఏడుగురికి గాయాలు
● సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
సాలూరు: పట్టణ బైపాస్ రోడ్డు డంపింగ్యార్డు వద్ద ఆదివారం వేకువజామున ఒడిశా బస్సు బోల్తా పడి పలువురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా రాష్ట్రం మల్కన్గిరి నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన బస్సు డంపింగ్ యార్డు సమీపానికి వచ్చేసరికి డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వేకువజామున ఉదయం నాలుగు గంటల సమయంలో బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్తో పాటు 29 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న సీఐ అప్పలనాయుడు తన సిబ్బందితో అంబులెన్స్ను తీసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను పట్టణ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యం పొందిన వారిలో ఒకరిని డిశ్చార్జ్ చేశారు. మిగిలిన ఆరుగురిని మెరుగైన వైద్యం కోసం విజయనగరం రిఫర్ చేసినట్టు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. మీనాక్షి తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఎస్పీ మాధవరెడ్డి పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు.
ఆటో బోల్తా


