ప్రైవేటు బస్సు యజమానుల సమస్యలు పరిష్కరించాలి
జయపురం: తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ప్రైవేటు బస్ యాజమాన్య సంఘ నాయకులు కోరారు. ఈ మేరకు జయపురం ప్రైవేటు బస్సుల యాజమాన్య సంఘ కార్యదర్శి, రవాణ శాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్, పీడీ, మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారులపై రాష్ట్ర హైకోర్టులో కొన్ని ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు మా జగత్ జననీ ప్రైవేట్ యజమానుల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు అశోక్ కుమార్ రోయ్, కార్యదర్శి బి.ఎస్.ఆర్.శానాపతి, ఉపాధ్యక్షులు అజయ్ రావత్, తిరుపతిపాణిగ్రహి, ఫిరోజ్ తెలిపారు. గురువారం సంఘనాయకులు విలేకరులతో మాట్లాడారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ సమయంలో ఇతర కార్యక్రమాలలో పాల్గొన్న బస్సులు రూట్ పర్మిట్ పొందినట్లు వారు ఆరోపించారు. అలాగే ప్రైవేట్ బస్సు స్టాండ్లోని దుకాణాలను మున్సిపాలిటీకి కేటాయించక పోవటం, బస్సు స్టాండ్లో ఉన్న స్టాళ్ల అద్దెలు మున్సిపాలిటీకి జమచేయక పోవటం, ఎన్నికలు జరగకుండానే ప్రైవేట్ బస్సు యజమానుల సంఘం జోన్–11లో ఉపాధ్యక్షుడుగా తానే స్వయంగా ప్రకటించు కోవటం మొదలగు అంశాలను ప్రస్తావించారు. అయితే వారి ఆరోపణలను ప్రైవేట్ బస్ యజమానుల సంఘ కార్యదర్శి తీవ్రంగా ఖండించారు. తన సొంత బంధువులను మోసం చేసి జైలుకు వెళ్లిన వ్యక్తి చేసిన ఆరోపణల్లో ఎంత వరకు నిజం ఉందో ప్రజలు తెలుసు కోవాలన్నారు.


