గంజాయి, గంజాయి తైలం స్వాధీనం
జయపురం: జయపురం పట్టణ పోలీసులు గంజాయితో పాటు, గంజాయి తైలంను పట్టుకున్నారు. సోమవారం తెల్లవారు జామున స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయ సమీపంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించగా అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతడి వద్ద 6 కిలోల 200 గ్రాముల గంజాయి, గంజాయితో తయారు చేసిన 1.20 కిలోల నూనె గుర్తించి సీజ్ చేశారు. ఆ వ్యక్తి బొయిపరిగుడ పోలీసు స్టేషన్ లక్ష్మీపూర్ గోపబందు ఖిళో(27) అని పోలీసు అధికారి ఉల్లాష్ చంద్ర రౌత్ వెల్లడించారు. వీటి విలువ రూ.14 లక్షలు ఉంటుందని తెలిపాడు. అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
రోడ్డు ప్రమాదంలో
కానిస్టేబుల్ దుర్మరణం
రాయగడ: రోడ్డు ప్రమాదంలో పోలీస్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో మృతునిది కళ్యాణసింగుపూర్లోని కొండవీధికి చెందిన నీకంఠ పువ్వల (35)గా గుర్తించారు. భువనేశ్వర్లోని బలిపటన పోలీస్ స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న నీలకంఠ తన విధులు ముగించుకొని వసతి గృహానికి బైకుపై తిరిగి వెళుతున్న సమయంలో బనమాలిపూర్ వద్ద ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్రగాయాలకు గురైన అతన్ని కేపిటల్ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. ఆదివారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. నీలకంఠ మృతి చెందిన విషయాన్ని కళ్యాణసింగుపూర్లోని తన కుటుంబీకులకు తెలియజేశారు. సోమవారం కుటుంబీకులు భువనేశ్వర్ చేరుకున్నారు.
యువత క్రీడల్లో రాణించాలి
రాయగడ: క్రీడారంగంలో యువత రాణించాలని రాజ్యసభ మాజీ సభ్యుడు, బిజూ స్వాభిమాన్ మంచ్ వ్యవస్థాపకులు నెక్కంటి భాస్కరరావు అన్నారు. సదరు సమితి పరిధిలోని బైరాగిహలువ వద్ద గుర్రాజుగుడ క్రికెట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా క్రీడాకారులనుద్దేశించి మాట్లాడారు. ప్రతీ ఒక్కరిలో ఏదో సాధిద్దామని అభిలాష ఉంటుందని అన్నారు. దానికి పదును పడితే వారి లక్ష్యాన్ని అధిగమించడం తథ్యమన్నారు. అదేవిధంగా తమలో ఉన్న ప్రతిభను చాటుకునేందుకు ఇటువంటి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. క్రీడాకారుల్లో పోటీతత్వం పెరగాలని హితవు పలికారు. టోర్నమెంటులో బరైరాగి హలువ, శెశిఖాల్, కెరడ, గజ్జిగాం, జిమిటి పేట పంచాయతీలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారని నిర్వాహకులు తెలియజేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాయగడ సమితి వైస్ చైర్మన్ హరప్రసాద్ హెప్రుక, బైరాగి హలువ సర్పంచ్ శ్రీనివాస్ పువ్వల, తపన్ పెద్దింటి, శ్రీకాంత చౌదరి, హలువ సర్పంచ్ తమ్మారావు బిడిక తదితరులు పాల్గొన్నారు.
మహా శివరాత్రి స్వచ్ఛత
భువనేశ్వర్: మహా శివరాత్రి సందర్భంగా ప్రసిద్ధ లింగ రాజు ఆలయ ప్రాంగణం, పరిసరాలు పూజాదుల వ్యర్థ పదార్థాలతో చిందర వందరగా తయారైంది. ఈ పరిస్థితి పర్యావరణ కాలుష్యానికి దారి తీయక ముందే తొలగించేందుకు భారతీయ రెడ్ క్రాస్ సంస్థ, ఒడిశా రాష్ట్ర శాఖ, కటక్, భువనేశ్వర్ జంట నగరాల కమిషనరేట్ పోలీస్ ప్రాంతీయ శాఖ సమన్వయంగా నడుం బిగించాయి. శివ రాత్రి మరునాడు సోమ వారం ఉదయం నుంచి ఈ కార్యకర్తలంతా ఆలయ ప్రాంగణంలో పేరుకుపోయిన చెత్తా చెదారం తొలగించి స్వచ్ఛతలో భగవంతుడు సాక్షాత్కరిస్తాడని సందేశం ప్రసారం చేశారు. వీరి సేవలు సర్వత్రా ప్రసంశలు అందుకున్నాయి.
గంజాయి, గంజాయి తైలం స్వాధీనం
గంజాయి, గంజాయి తైలం స్వాధీనం


