11 మంది బాల కార్మికుల గుర్తింపు
రాయగడ: సదరు సమితి చందిలి పోలీస్ స్టేషన్ పరిధిలో గల బాకురుగుడలో ఎస్ఎస్డీ పేరుతో నిర్వహిస్తున్న ఇటుక బట్టీలపై సోమవారం అధికారులు దాడులు నిర్వహించారు. సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేపట్టి ఇటుక బట్టీలో 39 మంది కార్మికులు పనిచేస్తుండగా ఇందులో 11 మంది బాల కార్మికులను గుర్తించారు. ఇసుక బట్టీ యజమానులు బాలలను ముందుగా డబ్బులు ఎరచూపి గత ఆరు నెలలుగా ఇటుకల తయారీకి ప్రోత్సాహించినట్లు అధికారులు చేపట్టిన దర్యాప్తులో తేలింది. ప్రతీరోజు తమ పిల్లలతో 14 గంటల పాటు పనులు చేయిస్తున్నారని సబ్కలెక్టర్కు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అదే విధంగా పని వదిలి వెళితే ఇబ్బందులు పడాల్సివస్తుందని యజమానులు బెదిరించడంతో గత్యంతరం లేక తమ పిల్లలను పనుల్లో చేర్పించడం జరిగిందన్నారు. ఎటువంటి వైద్య సౌకర్యాలు కల్పించడం లేదని వివరించారు. గత కొద్ది రోజుల క్రితం ఇటుక బట్టీలో బాలకార్మికులు పనిచేస్తున్నారన్న వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ దాడులను నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.


