14న రాష్ట్రీయ లోక్ అదాలత్
పర్లాకిమిడి: స్థానిక జడ్జి కోర్టులో జిల్లా న్యాయసేవా ప్రాధికరణ ఆధ్వర్యంలో మంగళవారం సివిల్ కోర్టులో వివిధ మోటారు వాహన చట్టాలు, లోక్ ఆదాలత్ కార్యక్రమం ప్రణాళిక, ఎం.సి.ఐ.ఏ.పి చట్టాలపై జిల్లా న్యాయ సేవా ప్రాధికరణ కార్యదర్శి బిమల్ రవులో అవగాహన కల్పించారు. ఈ న్యాయ సేవా ప్రాధికరణ, లీగల్ హెల్ప్ ఎయిడ్ సదస్సులో జిల్లా జడ్జి, చైర్మన్ జగదీష్ ప్రసాద్ మహంతి, అదనపు జిల్లా సెషన్సు జడ్జి, ముఖ్యమాజిస్ట్రేట్ సివిల్ సత్యనారాయణ పాత్రో, కోర్టు రిజిస్ట్రారు నరోత్తమ శెఠి, మహిళా కోర్టు (ఫ్యామిలీ) జడ్జి రస్మితా సాహు, ఎస్.డి.జె.ఎం విష్ణుప్రియ సామంతరే, జె.ఎం.ఎఫ్.సి సత్యజిత్ పాణి, ప్రోహిబిషన్ సివిల్ జడ్జి అభిమా మహాంకుడో, పర్లాకిమిడి బార్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.ఫృథ్వీరాజ్, సీనియర్ లాయర్ హీరాచంద్, ట్రాఫిక్ ఐఐసీ బల్లిక్ ప్రధాన్ తదితరులు హాజరయ్యారు.
ఈ నెల 14వ తేదీన జిల్లా కోర్టులో ప్రఽథమ రాష్ట్రయ లోక్ అదాలత్ జరుగనున్నదని జిల్లా జడ్జి జగదీష్ ప్రసాద్ మహంతి ఈ సందర్భంగా తెలియజే శారు. ఈ రాష్ట్రీయ లోక్ ఆదాలత్లో బ్యాంకు రుణాల ఎగవేత, చెక్బౌన్స్, ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి చలాన్లు కట్టడం, మోటారు దుర్ఘటన నష్టపరిహారం కేసులు, లేబర్, శ్రమ విభాగం, కుటుంబ కోర్టు కేసులు వంటివి పరిష్కరిస్తామన్నారు. కక్షిదారులు ఈ నెల 14న పర్లాకిమిడి జిల్లా కోర్టుకు హాజరై దీర్ఘకాలిక కోర్టు కేసులకు పరిష్కరించుకోవాలన్నారు. కాశీనగర్, ఆర్.ఉదయగిరి, మోహన కోర్టుల్లో కూడా లోక్ అదాలత్ జరుగుతుందని జిల్లా న్యాయసేవా ప్రాధికరణ కార్యదర్శి బిమల్ రౌళో తెలియజేశారు.


