24 కేజీల గంజాయి స్వాధీనం
నరసన్నపేట: తక్కువ డబ్బులకు ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి ఎక్కువ డబ్బులకు ఇతర ప్రాంతాల్లో అమ్మకానికి తీసుకువెళ్తున్న ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నలుగురిని పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 24 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు బుధవారం నరసన్నపేట సీఐ మరడాన శ్రీనివాసరావు, ఎస్సై బలివాడ గణేష్లు విలేకరులకు వివరాలు వెల్లడించారు. మడపాం టోల్గేట్ వద్ద మంగళ, బుధవారాల్లో పోలీసులు వాహనాల తనిఖీ చేపడ్డారు. లారీల్లో కొందరు అనుమానాస్పదంగా కనిపించడంతో ఆరా తీయగా వారి వద్ద గంజాయి పట్టుబడింది. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా భీమనాపూర్కు చెందిన ఇస్సాకో రైతా, గంజాం జిల్లా కమల పడార్ గ్రామానికి చెందిన సాగర్ పహాన్లు హైదరాబాద్కు 12 కేజీల గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. అలాగే ఉత్తరప్రదేశ్ బాగ్పట్ జిల్లా తాండ గ్రామానికి చెందిన ఆసిఫ్ఖాన్, ఆదిల్ ఖాన్లు జైపూర్లో 12 కేజీల గంజాయి కొనుగోలు చేసి కొరాపుట్ మీదుగా ఉత్తర ప్రదేశ్ వెళ్తుండగా మడపాం వద్ద పట్టుబడ్డారు. ఈ నలుగురినీ వేర్వేరు కేసుల్లో అరెస్టు చేశామని సీఐ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు.


