మళ్లీ సొంతగూటికి గణేష్ సావుంతా
రాయగడ: రాయగడ జిల్లా బీజేడీ ఉపాధ్యక్షుడు, ఆ పార్టీ సీనియర్ నాయకుడు కాసీపూర్కు చెందిన గణేష్ సావుంతా కొద్ది రోజుల క్రితం బీజేడీ ప్రాథమిక సభ్యత్వానికి, అదేవిధంగా ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీ సీనియర్ నాయకుడు సుధీర్ దాస్, జిల్లా అధ్యక్షుడు జగన్నాథ సరక, ఉపాధ్యక్షుడు పట్నాన గౌరీ శంకరరావుల సమక్షంలో తిరిగి తన రాజీనామ పత్రాన్ని ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇకపై తాను బీజేడీలోనే ఉంటూ కార్యకలాపాలు నిర్వహించడంతో పాటు పార్టీకి సేవలు అందిస్తానని వివరించారు. అయితే కొద్ది రోజుల క్రితం పార్టీకి రాజీనామ చేసినట్లు ప్రకటించిన గణేష్, తిరిగి తన రాజీనామను ఉపసంహరించుకోవడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో ఒక్కక్కరూ బీజేడీ నుంచి వైదొలుగుతుండడంతో పార్టీ ప్రాధాన్యత కోల్పోతుందని భావించిన ఆ పార్టీ సీనియర్ నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పిన వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జగన్నాథ సరక పావులను కదుపుతున్నారు. పార్టీని బలోపేతం చేయడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు.


