భలే భల్లూకం
రాయగడ: ఎలుగును చూస్తే భయంతో పారిపోతారు. అది ఎక్కడ దాడి చేస్తుందోనని దాన్ని తరిమే ప్రయత్నం చేస్తారు. అయితే అందుకు ఇక్కడ భిన్నంగా ఉంది. అందరితో ఈ భల్లూకం కలిసిమెలసి ఉంటోంది. వారు ఇచ్చే బిస్కెట్లు కూడా తింటోంది. ఈ వింత సంగతిని చూసేందుకు చుట్టు పక్కల ప్రజలు వెళ్తున్నారు. వారు తీసుకువచ్చిన తినుబండారాలను భళ్లూకానికి ఇచ్చి ఆనందంతో పరవశించిపోతున్నారు. ఈ విడ్డూరమైన దృశ్యం జిల్లాలోని పద్మపూర్ సమితి గుడారి సమీపంలో గల మొరిచొగుడలో గత కొద్ది రోజులుగా కొనసాగుతోంది. సమీపంలో ఉన్న అడవి నుంచి ప్రతిరోజూ సాయంత్రం ఆ ఎలుగు అక్కడే ఉన్న ఆదివాసీలకు సంబంధించిన మందిరానికి మెట్లను మరీ ఎక్కి వెళ్లి ఆ మందిరంలో గల పూజారి దగ్గరకు వెళ్లి అతను ఇచ్చే ప్రసాదాన్ని తింటుంది. అదేవిధంగా అక్కడకు వచ్చే భక్తులు ఇచ్చే బిస్కెట్లు, ఇతర ఆహారాన్ని తిని సరాసరి తను వచ్చే అడవులకు వెళ్లిపోతోంది. ఇలా ప్రతీ రోజు సాయంత్రం జరుగుతుంది. గుడారి అటవీ రేంజ్ అధికారులు మాత్రం ఎలుగుకు దూరంగా ఉండాలని, అదేవిధంగా ఆహారాన్ని ఇచ్చే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు. అయితే దాదాపు వారం రోజులు ఇలా గడుస్తున్నా ఇంతవరకు భల్లూకం ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టలేదు సరికదా వారు ఇచ్చే ఆహారాన్ని ఎంతో ముచ్చటగా తిని వెళుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
భలే భల్లూకం


