ఆత్మగౌరవం కాపాడాలి
సచివాలయ ఉద్యోగులంటే ప్రభుత్వం చాలా చులకనగా చూస్తోంది. సర్వేల పేరిట ఉద్యోగులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 70 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఎవరికి నచ్చినట్లు వారు తిడుతున్నారు. కనీస గౌరవం ఇవ్వకుండా పనులు చేయించుకుంటున్నారు. గత సెప్టెంబర్ 1 నుంచి సమ్మె చేస్తామని హెచ్చరికలు చేశా. అయితే సర్వేలను తగ్గిస్తామని హామీ ఇచ్చారు. కానీ మరింత పెంచారు. దీంతో ఒత్తిడి తట్టుకోలేక చచ్చిపోతున్నారు. ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే. రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగుల మరణాలపై విచారణ కమిషన్ వేయాలి. – కూన వెంకట సత్యనారాయణ, సచివాలయ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధి, శ్రీకాకుళం
●
ఆర్ఫన్ సర్వే తదితర 32 రకాల సర్వేలతో పాటు నెలవారీ ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ, ఆఖరికి బూత్లెవల్ ఆఫీసర్ల (బీఎల్ఓ) బాధ్యతలు వీరికే అప్పగించారు. దీనికితోడు ఉన్నతాధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులతో తిట్లు, చీవాట్లు నిత్యకృత్యం.
షోకాజ్ నోటీసులు..
ఓ వైపు సర్వేల ఒత్తిడి, మరో వైపు విధుల నిర్వహణతో సతమతమవుతూనే ఎప్పటికప్పుడు ప్రగతినివేదికలను అందిస్తున్నా చిన్నపాటి కారణాలు చూపిస్తూ, ఐవీఆర్ఎస్ కాల్స్లో అవినీతికి పాల్పడుతున్నారంటూ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ అవుతున్నాయి. గత నెలలో జిల్లాలో 564 మందికి షోకాజ్ నోటీసులివ్వడం గమనార్హం. ఐవీఆర్ఎస్ కాల్స్లో సచివాలయ ఉద్యోగుల శాఖ మినహా మిగతా 56 ప్రభుత్వ శాఖల ఉద్యోగుల అవినీతి ప్రస్తావన రావడం లేదని, షోకాజ్లు, సస్పెన్షన్ల ఊసే లేదంటూ కొందరు సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


