‘విద్యార్థుల్లో పోటీతత్వం పెరగాలి’
రాయగడ: విద్యారంగం కొత్త పుంతలు తొక్కుతున్న వేళ విద్యార్థుల్లో పోటీతత్వం మెరుగుపరిచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని సెంచూరియన్ విశ్వవిద్యాలయం (ఎపి) వైస్ చాన్స్లర్ డాక్టర్ ప్రశాంత్ కుమార్ మహంతి అన్నారు. స్థానిక పితామహల్లో గల సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో శుక్రవారం జరిగిన వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యాప్రమాణాలు పెరుగుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా చదువుపై శ్రద్ధ వహించాలని అన్నారు. సెంచూరియన్ విద్యాసంస్థల ప్రాంతీయ డైరక్టర్ డాక్టర్ రాజేష్ కుమార్ పాఢి మాట్లాడుతూ జీవితాన్ని రూపొందించడం, మెరుగైన సమాజాన్ని స్థాపించడంలో విద్యార్థుల పాత్ర కీలకమన్నారు.
భార్యకు గుర్తుగా..
రాయగడ: మృతి చెందిన భార్యకు గుర్తుగా సొంత ఖర్చులతో కల్యాణ మండపాన్ని నిర్మిం ప్రేమను చాటుకున్నాడు ఓ భర్త. జిల్లాలోని గుణుపూర్లో ఉదయ్ నాయక్ నివసిస్తున్నాడు. అతని భార్య మృదుభాషిణి 2022లో మృతి చెందారు. అయితే తన భార్యపై గల ప్రేమతో ఈ ప్రాంతంలొ ఏదైన గుర్తుగా ప్రజలకు వినియోగపడే పని చేయాలని సంకల్పించుకున్న నాయక్ గుణుపూర్లోని త్రినాథస్వామి మందిరం సమీపంలో సుమారు 1000 చదరపు అడుగుల స్థలంలో సుమారు ఎనిమిది లక్షల రూపాయలతో కల్యాణ మండపాన్ని నిర్మించారు. గత ఏడాది పనులు ప్రారంభించగా.. ఇప్పుడు నిర్మాణం పూర్తికావడంతో దాన్ని ప్రజలకు అంకితం చేశారు. భార్యపై ఉన్న ప్రేమను ఈ విధంగా చాటుకోవడంతో అందరూ నాయక్ను అభినందించడంతో పాటు ప్రజాహిత కార్యక్రమాల కోసం సొంత ఖర్చులతో అందరికీ వినియోగపడే కల్యాణ మండపం నిర్మించి ఇవ్వడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు.
‘విద్యార్థుల్లో పోటీతత్వం పెరగాలి’


