ఆనంద్పూర్ బ్యారేజ్ ప్రాజెక్ట్కు మార్గం సుగమం
● ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం
భువనేశ్వర్: రాష్ట్ర మంత్రి వర్గం 36వ సమావేశం ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అధ్యక్షతన లోక్ సేవా భవన్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. ఈ సమావేశంలో 5 ప్రధాన ప్రతిపాదనలు ప్రవేశ పెట్టారు. వాటిలో ఒకటి కొత్త ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ ప్రతిపాదనలుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనూ గర్గ్ తెలిపారు. మంత్రి వర్గం సమావేశం అనంతరం తీర్మానాల వివరాల్ని ఆమె మీడియాకు వివరించారు. ఆర్థిక శాఖ ప్రతిపాదించిన 2026–27 బడ్జెట్కు సంబంధించిన వివరాలు త్వరలో ప్రారంభం కానున్న శాసన సభ సమావేశంలో ప్రవేశ పెడతారు అన్నారు. మరో ప్రతిపాదన రాష్ట్ర కార్మిక, ఉద్యోగుల బీమా శాఖ ప్రవేశ పెట్టగా జలవనరుల శాఖ 3 ప్రతిపాదనలను మంత్రి మండలికి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలకు మంత్రి వర్గం ఆమోదించింది.
ఇంటిగ్రేటెడ్ ఆనంద్పూర్ బ్యారేజ్ ప్రాజెక్ట్
ఇంటిగ్రేటెడ్ ఆనంద్పూర్ బ్యారేజ్ ప్రాజెక్టులో భాగంగా భూగర్భ పైప్లైన్ పంపిణీ వ్యవస్థల నిర్మాణానికి రాష్ట్ర మంత్రి వర్గం అనేక కీలక టెండర్లను ఆమోదించింది. వైతరణి నదిపై నిర్మించిన ఈ ప్రధాన ప్రాజెక్టు కెంజొహర్, బాలాసోర్ జిల్లాల్లోని సుమారు 60,000 హెక్టార్ల పంట పొలాలకు సాగు నీటిపారుదల కల్పించడం ఈ పథకం లక్ష్యం. బ్యారేజీ నిర్మాణంతో సాలంది నది వ్యవస్థను బలోపేతం చేసి కాలువల ద్వారా 3,000 హెక్టార్లకు ప్రారంభ పంపిణీ ఇప్పటికే పూర్తయింది. మిగిలిన 57,000 హెక్టార్ల కమాండ్ ఏరియా (సీసీఏ)లో సంప్రదాయ కాలువల నిర్మాణం కోసం భూసేకరణలో తలెత్తుతున్న జాప్యం నివారించేందుకు ప్రభుత్వం ఆధునిక భూగర్భ పైప్లైన్ వ్యవస్థలకు నడుం బిగించింది. ఈ అధునాతన వ్యవస్థ కింద 57,000 హెక్టార్ల ప్రాంతానికి 9 ప్యాకేజీలుగా విభజించి ప్రాజెక్టు తదుపరి కార్యాచరణకు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేయడంతో మార్గం సుగమంమైంది.
కమాండ్ ఏరియా డెవలప్మెంట్ (సీఏడీ)తో సహా అన్ని పనులు ఈపీసీ–టర్న్కీ ప్రాతిపదికన నిర్వహిస్తారు. టెండరు ఆమోదం తేదీ నుండి 24 నెలలలోపు పూర్తి చేయాలని మంత్రి వర్గం కాల పరిమితి నిర్ధారించింది. ఈ పైప్లైన్లు బాలాసోర్ జిల్లాలోని కీలక వ్యవసాయ ప్రాంతాలలో వేలాది హెక్టార్లకు సమర్థవంతమైన సాగు నీటి పారుదలకు హామీపూర్వకంగా పని చేస్తాయని మంత్రి మండలి ఆశాభావం వ్యక్తం చేసింది.
ఆనంద్పూర్ బ్యారేజ్ ప్రాజెక్ట్కు మార్గం సుగమం


