అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో స్థిరపడిన తెలుగువారు ఈ వారాంతంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ (నైటా) ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా చిన్న పిల్లలకు భోగి పండ్ల కార్యక్రమం చేశారు. స్థానిక సౌతెర్న్ పార్క్ వేలో ఉన్న సాయి మందిర్ కు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కుటుంబాలు ఉత్సాహంగా ఈ వేడుకలో పాల్గొన్నాయి.
అమెరికాలోనే పుట్టి పెరిగిన చిన్నారులకు మన పండుగలు, సంప్రదాయాలు తెలిసేలా పండుగలను ప్రతీ యేటా నైటా నిర్వహిస్తోంది. రేగు పండ్లు, నాణేలు, పూలు, చెరకు ముక్కలతో భోగి పండ్లు పోసి, పిల్లలందరూ శ్రీమన్నారాయణుడి ఆశీర్వాదంతో ఆయురారోగ్యాలతో ఉండాలని పెద్దలందరూ దీవించారు.
పద్మశ్రీ నోరి దత్తాత్రేయుడు, పైళ్ల సాధన మళ్లారెడ్డి పిల్లలందరికీ ఆశీర్వచనాలు అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు అందరికీ నైటా తరపున బహుమతులు అందించారు. నైటా ప్రెసిడెంట్ రవీందర్ కోడెల, ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.


