విమాన ప్రయాణికుల కోరికను నెరవేరుస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై విమాన టికెట్ బుక్ చేసుకున్న 48 గంటల లోపు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా టికెట్ను రద్దు చేసుకోవడానికి లేదా మార్పులు చేసుకోవడానికి వీలు కల్పిస్తూ ‘లుక్-ఇన్ ఆప్షన్’ను తప్పనిసరి చేస్తూ కొత్త సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్ (సీఏఆర్)ను జారీ చేసింది.
ఎందుకీ నిర్ణయం?
గత కొంతకాలంగా విమానయాన సంస్థల కఠినమైన విధానాలు, టికెట్ రద్దు చేసినప్పుడు రిఫండ్ ఇవ్వడంలో జరుగుతున్న జాప్యంపై ప్రయాణికుల నుంచి భారీగా ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల హక్కులను కాపాడేందుకు డీజీసీఏ ఈ నిబంధనలను రూపొందించింది. నవంబర్ 2025లోనే ఈ ప్రతిపాదనలపై ప్రాథమిక నివేదికలు వచ్చినప్పటికీ ఇప్పుడు ఇది అధికారికంగా అమలులోకి రానుంది.
‘లుక్-ఇన్’ సదుపాయం
ఈ కొత్త నిబంధన ప్రకారం ప్రయాణికులు టికెట్ బుక్ చేసిన 48 గంటల లోపు రద్దు చేసుకుంటే ఎటువంటి క్యాన్సిలేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ప్రయాణ తేదీ లేదా సమయాన్ని మార్చుకోవాలనుకుంటే ఎయిర్లైన్స్ ఎటువంటి అదనపు సవరణ ఛార్జీలు వసూలు చేయవు.
అయితే, కొత్తగా ఎంచుకున్న విమాన టికెట్ ధరలో వ్యత్యాసం ఉంటే మాత్రం ప్రయాణికుడే భరించాల్సి ఉంటుంది.
డొమెస్టిక్ ఫ్లైట్స్ పరంగా ప్రయాణ తేదీకి కనీసం ఏడు రోజుల ముందు టికెట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుంది.
ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ పరంగా ప్రయాణానికి కనీసం 15 రోజుల ముందు బుకింగ్ చేసుకున్న వారికి ఇది వర్తిస్తుంది.
ఈ సౌకర్యం ప్రస్తుతం నేరుగా ఎయిర్లైన్ వెబ్సైట్ల ద్వారా బుక్ చేసుకున్న టికెట్లకే అమలవుతుంది.
రిఫండ్ ప్రక్రియపై గడువు
కేవలం రద్దు సదుపాయమే కాకుండా ప్రయాణికులకు రావాల్సిన నగదును తిరిగి చెల్లించే విషయంలో కూడా డీజీసీఏ కఠినమైన కాలపరిమితిని నిర్ణయించింది. విమానయాన సంస్థలు ప్రయాణికుల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని, రిఫండ్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని ఈ కొత్త సీఏఆర్ స్పష్టం చేస్తోంది. విమాన ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికల్లో అనివార్య కారణాల వల్ల మార్పులు చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ నిర్ణయం ఉపశమనం కలిగించనుంది.
ఇదీ చదవండి: షాపింగ్ బిల్లుకు నో ఫోన్నెంబర్!


