లిక్కర్‌ కేసులో కే​‍జ్రీవాల్‌కు ‍క్లీన్‌ చిట్‌, మాజీ సీఎం భావోద్వేగం | Liquor Policy Case Arvind Kejriwal, Manish Sisodia Cleared Of Charges | Sakshi
Sakshi News home page

లిక్కర్‌ కేసులో కే​‍జ్రీవాల్‌కు ‍క్లీన్‌ చిట్‌, మాజీ సీఎం భావోద్వేగం

Feb 27 2026 11:14 AM | Updated on Feb 27 2026 12:08 PM

Liquor Policy Case Arvind Kejriwal, Manish Sisodia Cleared Of Charges

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు Arvind Kejriwal) భారీ ఊరట లభించింది. ఎక్సైజ్ పాలసీలో ఎటువంటి కుట్ర లేదా నేరపూరిత ఉద్దేశ్యం లేదని రౌస్‌ రెవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. అవినీతి జరగలేదంటూ కేజ్రీవాల్‌తోపాటు మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలనుకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. దేశరాజధానిలో మద్యం అమ్మకాలకు కొత్త విధానాన్ని రూపొందించడంలో అవినీతి జరిగిందనే ఆరోపణల కేసులో ఆప్‌కు పెద్ద ఉపశమనం లభించినట్టే.

‘‘సత్యం చివరికి గెలుస్తుందని ఎపుడూ చెపుతూనే ఉన్నాం. సత్యం మావైపే ఉంది. సిట్టింగ్ ముఖ్యమంత్రిని ఇంటి నుంచి బయటకు లాగి జైలులో పడేశారు. మాపై బురద జల్లారు" అని కేజ్రీవాల్ సెంట్రల్ ఢిల్లీలోని కోర్టు వెలుపల విలేకరులతో మాట్లాడుతూ  భావోద్వేగానికి లోనయ్యారు.

 

లిక్కర్ పాలసీ అవినీతి కేసులో కేజ్రీవాల్, మణీష్ సిసోడియా సహా 20 మంది నిందితులందరికీ కోర్టు శుక్రవారం విముక్తి కల్పించింది. అలాగే సీబీఐ దర్యాప్తులో తీవ్ర లోపాలు ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. వేలాది పేజీల చార్జ్‌షీట్‌లో అనేక అంశాలు సాక్ష్యాలు లేదా సాక్షుల వాంగ్మూలాలతో మద్దతు పొందలేదని పేర్కొంది. చార్జ్‌షీట్‌లో తప్పుదారి పట్టించే వ్యాఖ్యానాలు ఉన్నాయని కూడా న్యాయ మూర్తి గమనించారు. మణీష్ సిసోడియాపై ప్రాథమికంగా కేసు నిలబడేంత ఆధారాలు సీబీఐ సమర్పించలేక పోయిందని కోర్టు తెలిపింది. 

కేజ్రీవాల్‌ను కూడా సరైన ఆధారాలు లేకుండానే కేసులో ఇరికించారని పేర్కొంది. ప్రధాన నిందితుడిగా పేర్కొన్న కుల్దీప్ సింగ్‌పై కూడా ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేవని, అయినప్పటికీ ఆయనను మొదటి నిందితుడిగా చేర్చడం ఆశ్చర్యకరమని కోర్టు వ్యాఖ్యానించింది. కేజ్రీవాల్ విషయంలో, రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలు మోపడం చట్టపరమైన ప్రమాణాలకు విరుద్ధమని కోర్టు పేర్కొంది. మౌలిక ఆధారాలు లేకుండా కుట్రలో ఆయన పాత్రను నిర్ధారించడం సాధ్యం కాదని తీర్పులో స్పష్టం చేసింది.దర్యాప్తు అధికారిపై శాఖాపరమైన విచారణ జరపాలని కూడా కోర్టు ఆదేశించింది. ఈ కేసులో మణీష్ సిసోడియా తరఫున సీనియర్ అడ్వకేట్ రెబెక్కా ఎం. జాన్, అడ్వకేట్ వివేక్ జైన్ హాజరయ్యారు. కేజ్రీవాల్ తరఫున సీనియర్ అడ్వకేట్ ఎన్. హరిహరన్, అడ్వకేట్ ముదిత్ జైన్ వాదనలు వినిపించారు.

కాగా 2021-22కి సంబంధించి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై అరవింద్ కేజ్రీవాల్‌పై కేసు నమోదైంది. 2021లో ఢిల్లీ ప్రభుత్వం ఆదాయం పెంచడం, మద్యం వ్యాపారాన్ని సంస్కరించడం లక్ష్యంగా రూపొందించిన ఎక్సైజ్ పాలసీపై అక్రమాల ఆరోపణలు రావడంతో ఉపరాజ్య పాలకుడు వినయ్ కుమార్ సక్సేనా సీబీఐ దర్యాప్తుకు ఆదేశించారు. ఈ పాలసీ ద్వారా ప్రైవేట్ సంస్థలకు అనుచిత లాభాలు కల్పించబడ్డాయని, ప్రజా ధనానికి నష్టం కలిగిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్,  సీబీఐ ఆరోపించాయి. మణీష్ సిసోడియాను సీబీఐ 2023 ఫిబ్రవరి 26న అరెస్ట్ చేయగా, మార్చి 9న  ఈడీ కూడా అరెస్ట్ చేసింది. 2021-22 ఎక్సైజ్ పాలసీ విషయంలో సరైన అనుమతి లేకుండా నిర్ణయాలు తీసుకుని లైసెన్సీలకు అనుచిత లాభాలు కల్పించారని ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపించారు.  6 నెలల పాటు తీహార్ జైలులో శిక్ష అనుభవించిన తర్వాత 2024 సెప్టెంర్‌లో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. అనంతరం సీఎం పదవికి కేజ్రీవాల్‌ రాజీనామా చేశారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఆప్‌ ఓటమి పాలు కావడంతో, బీజేపీ ఢిల్లీపీఠాన్ని కైవసం చేసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement