కర్ణాటకలో కొత్త ట్విస్ట్‌.. సిద్దరామయ్య, డీకేకు టెన్షన్‌! | Karnataka power-sharing buzz DK Shivakumar camp 30 MLAs at Bengaluru | Sakshi
Sakshi News home page

కర్ణాటకలో కొత్త ట్విస్ట్‌.. సిద్దరామయ్య, డీకేకు టెన్షన్‌!

Feb 27 2026 8:01 AM | Updated on Feb 27 2026 9:16 AM

Karnataka power-sharing buzz DK Shivakumar camp 30 MLAs at Bengaluru

బెంగళూరు: కర్ణాటకలో మరోసారి పొలిటికల్‌ ట్విస్ట్‌ చోటుచేసుకుంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వర్గానికి చెందిన ఇద్దరు మంత్రులు సహా దాదాపు 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంగళూరులోని ఒక ప్రైవేట్ హోటల్‌లో సమావేశమయ్యారు. ఇది అధికార పార్టీలో కొత్త రాజకీయ ఊహాగానాలకు దారితీసింది. దీంతో, మరోసారి సీఎం కుర్చీ మార్పు వ్యవహారం తెరపైకి వచ్చింది.

వివరాల మేరకు.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకల నెపంతో డీకే శివ కుమార్‌కు వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. అయితే, ఇది పుట్టినరోజు వేడుక అని బయటకు చెబుతున్నప్పటికీ రాజకీయ చర్చలు జరిగినట్టు పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారిలో డి. సుధాకర్, మాగడి బాలకృష్ణ, సిపి యోగేశ్వర్, కడలూరు ఉదయ్, రవి గనిగ, బసవరాజ్ శివగంగ, నయామ మొట్టమ్మ, శరత్ బచేగౌడ, కునిగల్ రంగనాథ్, ప్రకాష్ కొలివాడ, అనేకల్ శివన్న మరియు వెంకటేష్ పావగడ ఉన్నారు. మరోవైపు.. ఇటీవల 20 మందికి పైగా ఎమ్మెల్యేలు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లారు. ఇది వ్యవసాయ అధ్యయన యాత్రగా చెప్పబడినప్పటికీ రాజకీయ ఊహాగానాలు రేకెత్తించింది.

ఇదిలా ఉండగా.. కర్ణాటక సీఎం కుర్చీ విషయంలో కాంగ్రెస్‌ అధిష్ఠానానికి కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. తాజాగా కొత్తగా శాసనసభలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేల బృందం పదునైన లేఖలు సంధించటంతో అధిష్ఠానానికి అసలైన సవాలు ఎదురైంది. ఈ లేఖలో వారంతా తమ ఆవేదనను చెప్పుకొచ్చారు. అలాగే, తమ ఎన్నికపై కీలక వ్యాఖ్యలు చేశారు.

మాకు ఎవరైనా ఓకే.. 
కర్ణాటకలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌ సభ్యులు 135 మంది. వీరిలో 38 మంది తొలిసారి ఎన్నికైనవారు. వీరంతా ఎప్పటిలాగే సాధారణ పరిస్థితులుంటే నోరు మెదిపేవారు కాదేమో? ఆరేడు నెలలుగా పార్టీలో నెలకొన్న సందిగ్ధతపై తీవ్రంగా మనోవేదనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ అగ్రనేతలు సీఎం పీఠంపైనే దృష్టి సారించటం, మిగిలిన మంత్రులు ఎమ్మెల్యేలకు అందుబాటులో లేకపోవటంతో కొత్తవారి పరిస్థితి డోలాయమానంలో పడింది. అది ఎంతలా అంటే.. తమ జిల్లాలకు చెందిన మంత్రులు కూడా ఫోన్లకు అందుబాటులో లేకపోవటం, గ్యారంటీల కారణంగా నియోజకవర్గ పనులు మూలన పడటంతో వీరంతా ఏకంగా అధిష్ఠానానికి మొరపెట్టుకోక తప్పింది కాదు. సోమవారం దాదాపు 31 మంది ఎమ్మెల్యేలు లోక్‌సభ విపక్ష నేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్‌, రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జేవాలా, రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లకు ఏకకాలంలో లేఖాస్త్రాన్ని సంధించారు.

మమ్మల్నిగుర్తించండి.. 
‘పార్టీ 135 స్థానాలతో ఘన విజయం సాధించటంలో మా పాత్ర కూడా ఉంది. మేము నియోజకవర్గానికి ఏదో చేస్తామని ఓటర్లు విశ్వాసాన్ని ఉంచారు. ఏడాదిన్నరగా అగ్రనేతలు, మంత్రులెవరూ మా నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. ఇన్‌ఛార్జ్‌ మంత్రులు ఏడాది కాలంగా మా నియోజకవర్గానికి రాలేదు. చివరకు ఫోను చేసినా స్పందించటం లేదు. కనీసం మంత్రివర్గ విస్తరణ లేదా ప్రక్షాళన చేస్తే మా పరిస్థితి మెరుగుపడుతుంది. దేశంలో చాలా రాష్ట్రాల్లో తొలిసారి ఎమ్మెల్యేలు మంత్రులయ్యారు. కొన్ని చోట్ల ఏకంగా ముఖ్యమంత్రులే అయ్యారు. మాకు ఎవరి నాయకత్వం ఉన్నా ఒకటే. కొత్త మంత్రివర్గంలో చోటు కల్పిస్తే మా ఎన్నికకు ఓ అర్థం చెప్పినట్లు అవుతుంది’ అంటూ ఎమ్మెల్యేల బృందం ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ 31 మందిలో 18 మంది డీకే మద్దతుదారులు కావటంతో ఈ లేఖ రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement