యువకుని హత్య
విడపనకల్లు: కర్ణాటక ప్రాంతానికి చెందిన ఓ యువకుడు విడపనకల్లు మండలం డొనేకల్లు గ్రామ శివారులో దారుణ హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. అక్కడి ఆనవాళ్లను బట్టి బండరాళ్లతో కొట్టి హత్య చేసినట్లుగా నిర్ధారించారు. గురువారం మధ్య రాత్రి ఘటన జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. మృతదేహానికి సమీపంలోనే కర్ణాటక రిజిస్ట్రేషన్ కలిగిన ఓ స్కూటీ పడి ఉండడంతో దాని ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు హతుడిని రాయచూరు జిల్లా సింధనూరు గ్రామానికి చెందిన కిరణ్కుమార్ (38)గా గుర్తించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
అభివృద్ధి పనుల పరిశీలన
హొసపేటె: విజయనగర జిల్లా కొట్టూరు పట్టణంలో జరుగుతున్న ప్రజాసౌధ నిర్మాణ పనులు నాణ్యతగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే కే.నేమిరాజ్ నాయక్ తెలిపారు. గురువారం ప్రజాసౌధ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. పనులు నాసిరకంగా జరుగుతున్నాయని కొందరు చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. పదే పదే పని జరుగుతున్న ప్రదేశాన్ని సందర్శించి సంస్థల పేరుతో ఇబ్బందులకు గురి చేయడం, కాంట్రాక్టర్లను బెదిరించడం, డబ్బులు డిమాండ్ చేయడం సరికాదని ఆయన అన్నారు. ఇలాంటి కార్యకలాపాలు కొనసాగిస్తే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజాసౌధ నిర్మాణానికి చాలా ప్రయత్నాలు చేశామన్నారు. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చామన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఆటంకం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్, పోలీసు అధికారులకు సూచనలు ఇచ్చామని ఆయన అన్నారు. ఈసందర్భంగా తహసీల్దార్ జీకే అమరేష్, పట్టణ పంచాయతీ చీఫ్ ఆఫీసర్ నసరుల్లా, టీపీ ఈఓ విజయకుమార్, ఏపీఎంసీ మాజీ అధ్యక్షుడు బూడి శివకుమార్, పట్టణ పంచాయతీ సభ్యుడు శివానంద బావికట్టి, కర్ణాటక హౌసింగ్ బోర్డు ఇంజనీర్ హర్ష తదితరులు పాల్గొన్నారు.
అకాన్కాగ్వా పర్వతారోహణ
హొసపేటె: విజయనగర జిల్లాలోని కొట్టూరు తాలూకాలోని నాగరకట్టె గ్రామ నివాసి, ఆర్మీ వైద్యునిగా పనిచేస్తున్న డాక్టర్ కెప్టెన్ సంతోష్ అర్జెంటీనా దేశంలో ఎత్తైన అకాన్కాగ్వా పర్వతాన్ని 8 గంటల్లో అధిరోహించినట్లు తెలిపారు. ఈ పర్వతం ఎత్తు 6,961 మీటర్ల ఎత్తు అని, మరో నలుగురితో కలిసి ఎక్కినట్లు చెప్పారు. ఈ రికార్డు సాధనకు గాను కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ నుంచి పురస్కారం అందుకున్నట్లు తెలిపారు. గతంలోనూ హిమాలయాల్లో పలు పర్వతాలను చేరుకున్నట్లు ఆయన తెలిపారు.
పిల్లల దొంగ అని మహిళపై దాడి
సాక్షి,బళ్లారి: కలబుర్గి జిల్లా జేవర్గిలో చిన్న పిల్లలను ఎత్తుకెళ్లే దొంగ అని భావించి ఓ జోగతి మహిళపై స్థానికులు దాడి చేశారు. చిన్నారులను అపహరిస్తోందనే అనుమానంతో ఆ మహిళను రాళ్లతో కొట్టి హింసించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఆమెను రక్షించారు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
టెన్త్లో మంచి ఫలితాలు సాధించండి
రాయచూరు రూరల్ : మార్చి నెలలో జరగబోయే పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని మాన్వి తహసీల్దార్ భీమరావ్ సూచించారు. ఆయన గురువారం వివిధ గ్రామాల్లో సంచరించి ఇంటింటికెళ్లి విద్యార్థులను కలిసి విజన్– 625ను లక్ష్యంగా పెట్టుకొని విద్యార్థుల మనోబలాన్ని పెంచి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. మరో వైపు జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ విద్యార్థుల తల్లిదండ్రులకు లేఖలు రాసి పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బాగా చదవాలని సూచించారు. పరీక్షలకు కేవలం కొన్ని రోజులు మాత్రమే గడువు ఉండడంతో చదువుపై శ్రద్ధ పెట్టాలని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం వేళలో విద్యార్థులకు విద్యాభ్యాసానికి తల్లిదండ్రులు అవకాశం కల్పించాలని కోరారు.
యువకుని హత్య
యువకుని హత్య
యువకుని హత్య


