28 నుంచి ద్వితీయ పీయూసీ పరీక్షలు
కోలారు: ఈనెల 28వ తేదీ నుంచి మార్చి నెల 17వ తేదీ వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఆర్.రవి తెలిపారు. గురువారం తన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు, ఇంటర్ పరీక్ష నిర్వాహకులకు సూచనలు చేసినట్లు తెలిపారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు మొత్తం 14,567 విద్యార్థులు హాజరవుతారని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 28 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. కోలారు తాలూకాలో అతి ఎక్కువగా 10 కేంద్రాలు, ముళబాగిలులో 5, శ్రీనివాసపురంలో 3, మాలూరులో 4, కేజీఎఫ్లో 3, బంగారుపేటలో 3 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో విద్యుత్, నీటి వ్యవస్థ, ప్రథమ చికిత్స తదితర అన్ని సౌకర్యాలను కల్పించాలని సూచించానన్నారు.


