సోషల్ మీడియాలో వీడియో వైరల్
సాక్షి,బళ్లారి: ఇటీవల మహిళలపై స్వామీజీల అత్యాచారాలు, దౌర్జన్యాలు పెరిగిపోతున్న నేపథ్యంలో యాదగిరి జిల్లాలో ఓ మఠానికి చెందిన స్వామీజీ బాలికపై ప్రవర్తించిన తీరు, అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్వామీజీపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. యాదగిరి జిల్లా షాపుర తాలూకా మహల్రోజా గ్రామంలోని యమనూరప్ప ముత్యా ఆశ్రమానికి చెందిన స్వయం ప్రకటిత స్వామీజీగా గుర్తింపు పొందిన మల్లికార్జున ముత్యా(తాత) రెండు రోజుల క్రితం ఓ బాలికపై అనుచితంగా ప్రవర్తించినట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై మహిళా సంఘాలు, పలు ప్రజా సంఘాలు, బాలల అభివృద్ధి సంక్షేమ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అనంతరం పోలీసులు అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. కేసు నమోదైన తర్వాత మల్లికార్జున ముత్యా కనిపించకుండా పోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
నేను ఎలాంటి తప్పు చేయలేదు
కాగా అజ్ఞాత ప్రదేశం నుంచి మల్లికార్జున ముత్యా ఓ వీడియో పోస్ట్ చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తాను ఎక్కడికీ వెళ్లలేదని, పోలీసులు పిలిచిన వెంటనే హాజరవుతానని అందులో పేర్కొన్నారు. తన మఠానికి చెడ్డపేరు తీసుకు రావడానికి కొందరు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా బాలికతో అనుచితంగా ప్రవర్తించినట్లు వీడియోను వైరల్ చేశారన్నారు. ఇది ఎంత మాత్రం నిజం కాదన్నారు. మఠంలో సామూహిక వివాహాలు జరిపేందుకు, ఆహ్వాన పత్రికలు పంచడానికి వెళ్లానన్నారు. తనకు తప్పించుకుని తిరిగే ఉద్దేశం లేదన్నారు. తాను సామాజిక సేవ చేస్తున్నానని, దానిని చూసి ఓర్చుకోలేక ఇలాంటి పనులు చేస్తున్నారన్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు తాను భయపడేది లేదన్నారు. పోలీసులు, చట్టాన్ని గౌరవిస్తానన్నారు. తన భక్తులు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తాను తప్పు చేయను, చేయబోనని, ఈ విషయం తన భక్తులకు తెలుసని అన్నారు.
ముత్యాపై కేసు నమోదు
రాయచూరు రూరల్: స్వయం ప్రకటిత దైవ మానవుడు ముత్యాపై కేసు నమోదైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రెండు రోజుల క్రితం దైవవాణిని వినిపించే దైవ మానవుడు బాలికతో సరసాలాడినట్లు వీడియోను వైరల్ చేయడంతో మహిళా శిశు సంరక్షణ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. కళ్యాణ కర్ణాటకలోని యాదగిరి జిల్లా శహాపుర తాలూకా మహల్రోజా మల్లికార్జున ముత్యాపై కేసును నమోదు చేసుకొని జిల్లా ఎస్పీ పృథ్వీ శంకర్కు లేఖ రాశారు. మైనర్ బాలికను ఒడిలో కూర్చోబెట్టుకొని ముత్యా అనుచితంగా ప్రవర్తించినట్లు వీడియోలో ఉందని, ఈ విషయంపై యాదగిరి జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.
అది మఠానికి చెడ్డపేరు తేవడానికి
ప్రత్యర్థుల కుట్ర
అజ్ఞాతంలో నుంచి వీడియో విడుదల చేసిన మల్లికార్జున ముత్యా


