ఇరాన్ అమెరికా మధ్య కమ్ముకుంటున యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. తమ సైన్యం ఇరాన్కు బయల్దేరింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం.. అమెరికా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు ఇరాన్ వైపు కదులుతున్నాయి.
ఆర్థిక సంక్షోభం వేళ.. అక్కడి ప్రజల తీవ్ర నిరసనలతో ఇరాన్ అట్టుడికిపోయింది. భద్రతా బలగాల ప్రతిఘటనలో వేల సంఖ్యలో నిరసనకారులు మరణించారని హక్కుల సంఘాలు నివేదికలు ఇచ్చాయి. అలాగే వేల మందిని జైల్లో పెట్టారని.. వాళ్లలో కొందరిని దేశద్రోహులుగా ఉరి తీయబోతున్నారని కథనాలు వెలువడ్డాయి.
ఈ అణచివేతపై ట్రంప్ అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. తాము చూస్తూ ఉండబోమని.. ఇరాన్ నిరసనకారులకు అవసరమైన సాయం పంపిస్తామని ప్రకటించారు. ఈ లోపు పరిస్థితులు చల్లబడి ఆందోళనలు తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో నిరసనకారుల ఉరితీత ఆగిపోయింది. అయితే..
తన వల్లే నిరసనకారుల ఉరి ఆగిందంటూ ట్రంప్ ప్రకటించుకోగా.. ఇరాన్ దానిని తోసిపుచ్చింది. కాస్త ఆలస్యమైనా శిక్ష తప్పదన్నట్లు ఖమేనీ ప్రభుత్వం సంకేతాలు పంపించింది. దీంతో ట్రంప్నకు మళ్లీ కోపమొచ్చింది. ఈలోపు.. ఇరాన్ అణు కార్యకలాపాలు నిర్వహిస్తుందన్న అనుమానాలూ వ్యక్తం చేసిన ఆయన.. గట్టి వార్నింగే ఇచ్చారు.
సైనిక చర్యే చివరి ఆప్షన్ అంటూ ట్రంప్ ప్రకటించారు. ఈ క్రమంలో సైన్యం మోహరింపు ఆదేశాలు జారీ చేసిన ఆయన.. అదనపు బలగాలనూ సిద్ధం చేయాలని సూచించారు. దీంతో ఐదు వేల మంది సిబ్బందితో కూడిన బలగాలను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు.. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ ధీటుగా స్పందిస్తోంది. తమ వేలు ట్రిగ్గర్పైనే ఉందంటూ ప్రకటనలు ఇస్తోంది.
ఇరాన్ను నిశితంగా గమనిస్తున్నాం. భారీ సంఖ్యలో మా యుద్ధనౌకలు ఆ దేశం వైపు కదులుతున్నాయి. ఏమీ జరగకూడదనే అనుకుంటున్నా. వాటిని మేం ఉపయోగించకపోవచ్చు. ఏం జరుగుతోందో చూద్దాం అని ట్రంప్ దావోస్ సదస్సు అనంతరం వ్యాఖ్యానించారు. అయితే.. ట్రంప్ ఇప్పటిదాకా ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోయినా.. అమెరికా యుద్ధనౌకలు, ఫైటర్ జెట్లు, క్షిపణి వ్యవస్థలు, గగనతల రక్షణ వ్యవస్థలు ఇరాన్ వైపు కదులుతుండటంతో పరిస్థితి హీటెక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


