అమెరికా-భారత్ మధ్య ట్రేడ్ డీల్ దాదాపుగా కుదిరినట్లే!. ఇరు దేశాల మధ్య ర్చలు ఓ కొలిక్కి వచ్చాయని.. తన మిత్రుడు మోదీతో ఫోన్లో సంప్రదింపులు జరిపానని.. అన్నింటికి ఆయన ఒప్పుకున్నారని.. అందుకే భారత్పై సుంకాలను తగ్గిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇటు ఈ డీల్ను గ్రేట్గా అభివర్ణిస్తూ భారత ప్రజల తరఫున ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు కూడా. అయితే.. ఇక్కడే ఓ మెలిక ఉంది.
భారత్ నుంచి ప్రస్తుతం అమెరికా 50 శాతం సుంకాలు వసూలు చేస్తోంది. ఇందులో 25 శాతం ప్రతీకార సుంకాలు కాగా.. మరో 25 శాతం పెనాలిటీ టారిఫ్ ఉంది. టారిఫ్లు 18 శాతానికి తగ్గిస్తున్నామని.. వీటిని సున్నాకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తామని ట్రంప్ అన్నారు. ఈ క్రమంలో రష్యా నుంచి పూర్తిగా చమురు కొనుగోలును ఆపేందుకు భారత్ అంగీకరించిందని చెప్పారు. అయితే సుంకాల తగ్గింపుపై థ్యాంక్స్ మెసేజ్లో మోదీ ఈ అంశాన్ని ఏమాత్రం ప్రస్తావించలేదు. అలాగే అమెరికా ఉత్పత్తులను భారీ మొత్తంలో భారత్ కొనుగోలు చేస్తుందన్న ట్రంప్ స్టేట్మెంట్పైనా స్పందించలేదు.
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్ల విషయంలో ట్రంప్ ఇలా ప్రకటనలు చేయడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ ఇలా చార్లు ఆయన బహిరంగంగా ప్రకటించారు. అయితే ఆయన ప్రకటనతో ఆయా సందర్భాల్లో భారత ప్రభుత్వం బహిరంగంగా విబేధించింది. అలాంటిదేం ఉండబోదని.. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గమని.. జాతి ప్రయోజనాల మేరకు తమ నిర్ణయం ఉంటుందని ప్రకటించింది.
అయితే ఈసారి మాత్రం ఇంక ప్రభుత్వం తరఫున ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీనిని వ్యూహాత్మక మౌనమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.అమెరికా, రష్యాలతో సంబంధాల నేపథ్యంలోనే ఇలా వ్యవహరిస్తుందని అంచనా వేస్తున్నారు. రష్యా ఆయిల్ కొనుగోలు ఆపివేతపై టారిఫ్ల తగ్గింపు నేపథ్యంలో భారత ప్రభుత్వం ఎలాంటి ప్రకటన ఇస్తుందో చూడాలి. అలాగే టారిఫ్లు 50 నుంచి 18కి తగ్గాయా? లేదంటే 25 శాతం నుంచే 18కి చేరాయా? అనేదానిపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అటు..
రష్యా సైతం ట్రంప్ తాజా ప్రకటనపై ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. గతంలో మాత్రం.. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకంగా చూస్తూ, తమ చమురు మార్కెట్పై ప్రభావం ఉంటుందని సూచించింది. అలాగే భారత్ తమకు మిత్ర దేశమని.. ఇతర దేశాల ఒత్తిళ్లకు తలొగ్గే అవకాశమే ఉండబోదని ధీమా వ్యక్తం చేసింది. ఒకవేళ భారత్ రష్యా చమురు దిగుమతులను ఆపితే, రష్యా ఆసియా మార్కెట్లో తన స్థానాన్ని కోల్పోయే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
రష్యా చమురు ఆగిందా?
ట్రంప్ చెబుతున్నట్లు.. భారత్ రష్యా చమురు దిగుమతులు పూర్తిగా ఆగిపోలేదు. 2024లో రష్యా నుంచి భారత్ సుమారు 52.7 బిలియన్ డాలర్ల విలువైన చమురు దిగుమతి చేసింది. 2025 చివరలో ఈ తగ్గుదల కనిపించినా.. 2026 జనవరిలో కూడా మూడు కంపెనీలు (IOCL, BPCL, Nayara Energy) రష్యా చమురు కొనుగోలు కొనసాగించాయి. ఇక..
ఒకప్పుడు రష్యా నుంచి భారత్ కేవలం 2 శాతం మాత్రమే చమురు దిగుమతి చేసుకునేది. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్ రష్యా చమురు కొనుగోలు పెంచింది. ఎందుకంటే ఆ సమయంలో డిస్కౌంట్ ధరలు లభించాయి కాబట్టి. అలా.. 2024లో సుమారు US$52.7 బిలియన్ విలువైన చమురును దిగుమతి చేసుకుంది.
2025లో.. అమెరికా సుంకాల-ఆంక్షల బెదిరింపులు.. ట్రంప్ ఒత్తిడి, రష్యా నుంచి వచ్చే డిస్కౌంట్ తగ్గిపోవడం, మిడిల్ ఈస్ట్ నుంచి సరఫరా పెరగడం.. తదితర కారణాలతో చమురు దిగుమతులు తగ్గినట్లు అనిపించాయి. డిసెంబర్ 2025లో భారత్ మొత్తం చమురు దిగుమతులు 21.6 మిలియన్ టన్నులకు చేరాయి, అయితే.. గత 9 నెలల్లో ఇదే అత్యధికం. ఇక.. జనవరి 2026లో రష్యా చమురు దిగుమతులు నవంబర్తో పోలిస్తే 35% తగ్గాయి. రిలయన్స్ వంటి పెద్ద ప్రైవేట్ కంపెనీలు రష్యా చమురు కొనుగోలు తగ్గించాయి, కానీ IOCL, BPCL, Nayara Energy మాత్రం కొనుగోలు కొనసాస్తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.
సూటిగా మూడు పాయింట్లలో..
భారత్: ట్రంప్ సుంకాల తగ్గింపును స్వాగతించింది. కానీ రష్యా చమురు అంశంపై మౌనం పాటిస్తోంది
అమెరికా: భారత్ రష్యా చమురు ఆపివేస్తుందని ధృవీకరించింది
రష్యా: ఆసియా మార్కెట్ దెబ్బ తినే అవకాశంతో.. ట్రంప్ ప్రకటనను ఖండించే చాన్స్


