కౌలాలంపూర్: ఇండియన్ నేషనల్ ఆర్మీ(ఆజాద్ హింద్ ఫౌజ్)లో పనిచేసిన యోధుడు జయరాజ్ రాజారావును మలేషియా పర్యటనలో భాగంగా ఆదివారం ప్రధాని మోదీ కౌలాలంపూర్లో కలుసుకున్నారు. ఐఎన్ఏ శ్రేణులు ప్రదర్శించిన అసాధారణ ధైర్యసాహసాలు, వారి ఆశయాలు, త్యాగాలకు భారతీయులందరి తరపున కృతజ్ఞతలు తెలిపారు.
జయరాజ్ రాజా రావును కలుసుకోవడం ఎంతో ప్రత్యేకమని అనంతరం ప్రధాని మోదీ ఎక్స్లో పేర్కొన్నారు. ఆయనతో ఉన్న ఫొటోలను షేర్ చేశారు. బ్రిటిష్ సైన్యాన్ని ఎదుర్కొనే క్రమంలో ఎదురైన అనుభవాలను ఆయన నుంచి తెలుసుకోవడం ఎంతో ప్రేరణ కలిగించిందన్నారు.
జయరాజ్ రాజావుతోపాటు మరో వెటరన్ను కూడా ప్రధాని మోదీ కలుసుకున్నారని విదేశాంగ శాఖ తెలిపింది. బ్రిటిషర్ల పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించడమే లక్ష్యంగా ఒకప్పుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఐఎన్ఏను స్థాపించడం తెల్సిందే. 1943 సెప్టెంబర్లో కౌలాలంపూర్లోని ఇండిపెండెన్స్ స్క్వేర్లో చేరిన వేలాది మంది అనుచరులనుద్దేశించి నేతాజీ చేసిన ప్రసంగం అనంతరకాలంలో ఎందరో యువత ఐఎన్ఏలో చేరేందుకు ప్రేరణగా నిలిచింది. అప్పట్లో మలేసియా, సింగపూర్ ప్రధాన కేంద్రాలుగా ఐఎన్ఏ కార్యకలాపాలు సాగాయి.


