ceo arrest
-
రూ.500 కోట్ల రియల్ స్కాం, సీఈవో అరెస్ట్
హరియాణాలోని గురుగ్రామ్లో భారీ రియల్ ఎస్టేట్ కుంభకోణం ప్రకంపనలు రేపుతోంది. ప్రముఖ లగ్జరీ హబ్ ‘32 అవెన్యూ’ CEO ధ్రువ్ శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.500 కోట్ల రియల్ ఎస్టేట్ కుంభకోణం చేశాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి పోలీసుల ప్రకారం, శర్మ ఒక వాణిజ్య భవనంలోని ఒకే అంతస్తును దాదాపు 25 మంది విక్రయించాడు. భారీ మోసపూరిత ఆపరేషన్కు సంబంధించి గురుగ్రామ్ పోలీసులు శుక్రవారం శర్మను అరెస్టు చేశారు. ఈ ఫిర్యాదుల విలువ మొత్తం రూ. 500 కోట్ల దాకా ఉంటుందని దర్యాప్తు అధికారుల అంచనా. నకిలీ ఒప్పందాలు, తప్పుదారి పట్టించే హామీలు, లాభాల ఆశ జూపి విక్రయించాడనేది ఆరోపణ.అయితే కొనుగోలుదారులకు సంబంధిత ఆస్తిని స్వాధీనం చేయకుండా ఏవేవో సాకులు చెబుతూ జాప్యం చేయడం, యాజమాన్య పత్రాలు ఇవ్వలేదని ఫిర్యాదు చేయడంతో ఈ మెగా స్కాం వెలుగులోకి వచ్చింది. ప్రతి లావాదేవీని చట్టబద్ధంగా కనిపించేలా చేయడానికి అనేక నకిలీ పత్రాలను సృష్టించి కొనుగోలు దారులను మోసం చేశాడు. ఈ విధంగా 2022 - 2023 మధ్యకాలంలో ఈ కాంప్లెక్స్లోని 3,000 చదరపు అడుగుల మొదటి అంతస్తు యూనిట్ను విక్రయించి, శర్మ వివిధ వ్యక్తుల నుండి సుమారు రూ. 500 కోట్ల మేర మోసం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. జనవరిలో ట్రామ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి ఒకరు అప్రా మోటెల్స్, 32 మైల్స్టోన్ విస్టాస్ ప్రైవేట్ లిమిటెడ్పై ఫిర్యాదు చేశారని గురుగ్రామ్ పోలీసుల ప్రతినిధి తెలిపారు. దీంతో పాటు ఇతర ఫిర్యాదుల మేరకు పలు కేసులు నమోదయ్యాయి. అధికారులు బ్యాంకు రికార్డులు, ఆర్థిక లావాదేవీలు మరియు ప్రాజెక్టుకు సంబంధించిన షెల్ ఎంటిటీలను పరిశీలిస్తున్నారు. ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు తర్వాత, ధ్రువ్ దత్ శర్మను శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ మరిన్ని అరెస్టులు చేసేఅవకాశంఉందని పేర్కొన్నారు. నిందితుడిని నగర కోర్టులో హాజరుపరిచి ఆరు రోజుల పాటు పోలీసు కస్టడీకి తీసుకున్నారు. మరోవైపు రూ.64 లక్షలు మోసం చేశారని ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక జంట ఆరోపించారు. వారి ఫిర్యాదుమేరకు డిసెంబర్లో సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్లో సీఈఓ ధ్రువ్ శర్మ, అతని సోదరి, తల్లిదండ్రులు, ఇతరులపై నేరపూరిత కుట్ర, నేరపూరిత నమ్మక ద్రోహం, మోసం, ఫోర్జరీ లాంటి అభియోగాలు మోపడం గమనార్హం. అంతేకాదు 32వ అవెన్యూ ఉద్యోగి కార్మికులకు గత కొన్ని నెలలుగా జీతం చెల్లించలేదట.గతంలో ఫోర్బ్స్ 30 అండర్ 30లో చోటు సంపాదించుకున్న ధ్రువ్ శర్మ అవినీతి వ్యవహారం, భారతదేశ రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, నియంత్రణ, పెట్టుబడిదారుల రక్షణ గురించి ఆందోళనలను మరింత పెంచింది. -
టెలిగ్రామ్లో ఇకపై అవి సెర్చ్ చేయలేరు!
ప్రముఖ ఆన్లైన్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ తన సర్వీస్ నిబంధనల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, పిల్లల లైంగిక వేధింపులు, హింసను ప్రేరేపించే కంటెంట్ టెలిగ్రామ్లో వ్యాపిస్తున్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గతంలో ఈ సమాచారం నియంత్రణకు ప్లాట్ఫామ్లో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వచ్చాయి. దాంతో సంస్థ సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దురోవ్ పావెల్ను ఇటీవల పారిస్ అధికారులు అరెస్ట్ చేశారు. ఫలితంగా కంపెనీ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. సర్వీస్ నిబంధనల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది.ప్లాట్ఫారమ్ సెర్చ్ ఫంక్షన్ని ఉపయోగించి ఇకపై చట్టవిరుద్ధ కార్యకలాపాలు, కంటెంట్ కోసం వెతకలేరని తెలిపింది. ఒకవేళ వినియోగదారులు అలాంటి కంటెంట్ను యాక్సెస్ చేయడానికి పలుమార్లు ప్రయత్నిస్తే చట్టబద్ధంగా అవసరమైతే వారి ఫోన్ నంబర్లు, ఐపీ చిరునామాలను ప్రభుత్వ అధికారులకు అందజేస్తుందని సంస్థ వర్గాలు స్పష్టం చేశాయి. టెలిగ్రామ్ సెర్చ్ ఫీచర్ స్నేహితులు, వార్తలను కనుగొనడం కోసం ఉద్దేశించబడిందని, చట్టవిరుద్ధమైన కార్యకలాపాల కోసం కాదని ఈ సందర్భంగా దురోవ్ తెలిపారు. టెలిగ్రామ్లో డ్రగ్స్, స్కామ్, పిల్లల లైంగిక వేదింపులు, హింస..వంటి కంటెంట్ను కట్టడి చేయడానికి ప్రత్యేకంగా కృత్రిమ మేధ (ఏఐ)ని ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: నూనెల ధర ఎందుకు పెరిగింది?పారిస్ పోలీసులు దురోవ్ పావెల్ను ఇటీవల అరెస్ట్ చేయడంతో నిబంధనల ప్రకారం ఐదు మిలియన్ యూరోలు(రూ.46 కోట్లు) విలువ చేసే బాండ్ను అందించి న్యాయ పర్యవేక్షణలో ఉన్నారు. దాంతోపాటు టెలిగ్రామ్ ప్లాట్ఫామ్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలను కట్టడి చేసేందుకు చర్యలు అమలు చేస్తున్నారు. దురోవ్ అరెస్ట్ సమయంలో టెలిగ్రామ్ను నిలిపేస్తారేమోననే వార్తలు రావడం గమనార్హం. -
హెచ్1 బీ ఫ్రాడ్ : ఇండియన్ సీఈవో అరెస్టు
న్యూయార్క్: హెచ్1-బీ వీసా, గ్రీన్ కార్డుల దరఖాస్తుల్లో అక్రమాలకు పాల్పడుతున్న ఒక ఇండియన్ సీఈవోకు అమెరికా ప్రభుత్వం చెక్ చెప్పింది. తప్పుడు, మోసపూరిత పత్రాలతో దాదాపు 200 హెచ్1 బీ వీసాలను పొందిన కేసులో అమెరికాలో అజీమెట్రీ, డివెన్సి అనే రెండు ఐటీ కంపెనీలకు సీఈవో ప్రద్యుమ్న కుమార్ సామల్ (49) ను అధికారులు అరెస్ట్ చేశారు. నకిలీ, మోసపూరితమైన డాక్యుమెంట్లతో 200మంది విదేశీయులకు హెచ్1 బీ వీసాలు సాధించారనే ఆరోపణలతో కమార్ను అరెస్ట్ చేశారు. ఇండియానుంచి తిరిగి అమెరికా వస్తుండగా సియాటెల్ విమానాశ్రయం వద్ద ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. 2018, ఏప్రిలో నమోదైన వీసా ఫ్రాడ్ కేసు విచారణ జరుగుతుండగా నిందితుడు సామల్ పారిపోయాడని అధికారులు తెలిపారు. 2010, 2011 సంవత్సరాల్లో వాషింగ్టన్ లో హెచ్1-బీ వీసా, గ్రీన్ కార్డుల పేరుతో భారీ మోసాలకి పాల్పడాడనీ, బెంచ్-అండ్-స్విచ్ స్కీం కింద వీసా దరఖాస్తుల కోసం కస్టమర్ల నుంచి డబ్బును నేరుగా తన ఖాతాలోకి మళ్లించి, తద్వారా ప్రభుత్వాన్ని మోసగించాడని అధికారులు ఆరోపించారు. కాగా వీసా మోసం కేసులో పది సంవత్సరాల జైలుతో పాటు, 250,000 డాలర్లు జరిమానా విధించే అవకాశం ఉంది. -
కంపెనీ సొమ్మును వేశ్యలపై తగలేసిన సీఈవో
ఇటీవల కుప్పకూలిన బిట్కాయిన్ ఎక్స్ఛేంజ్-మౌంట్గాక్స్ అధిపతికి సంబంధించి మరో బండారం బయటపడింది. ఆన్లైన్ వినియోగదారుల నుంచి దొంగలించిన సొమ్మును అతను వేశ్యలపై తగలేసినట్టు తాజాగా వెలుగుచూసింది. కాల్పనిక నగదు (వర్చువల్ కరెన్సీ) పేరిట వినియోగదారుల నుంచి వందలకోట్ల వసూలుచేసిన బిట్కాయిన్ సంస్థ ఇటీవల దివాళా తీసినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వినియోగదారుల ఆన్లైన్ ఖాతాల నుంచి వర్చువల్ నగదు మాయమైన వ్యవహారంలో కంపెనీ సీఈవో కార్పెలస్ హస్తం కూడా ఉందని, అతను మోసపూరితంగా వినియోగదారులకు చెందిన 1.66 లక్షల డాలర్లను తన వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ వ్యవహారంలో జపాన్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. తాజాగా అతనిపై మరికొన్ని అభియోగాలు వెలుగుచూశాయి. వినియోగదారుల నుంచి దొంగలించిన సొమ్మును అతను వేశ్యలపై ఖర్చు చేశాడని, శృంగార సేవలు లభించే కార్యక్రమాల్లో పాల్గొని మహిళలపై అతను ఈ సొమ్ము ఖర్చు పెట్టాడని జపాన్ మీడియా తెలిపింది. 2011-13 మధ్యకాలంలో తనకు చెందిన డజన్ కంపెనీల్లోకి నిధులు మళ్లించిన వ్యవహారంపై కార్పెలస్ మొదట అరెస్టయ్యాడు. అనంతరం విడుదలైన అతన్ని బిట్కాయిన్ డిపాజిట్లను మళ్లించిన వ్యవహారంలో మళ్లీ అరెస్టు చేశారు.


