హైస్పీడ్‌గా రైల్‌ | Seven new high speed corridors in the country | Sakshi
Sakshi News home page

హైస్పీడ్‌గా రైల్‌

Feb 2 2026 3:18 AM | Updated on Feb 2 2026 4:12 AM

Seven new high speed corridors in the country

దేశంలో ఏడు కొత్త హైస్పీడ్‌ కారిడార్లు

వీటిలో పుణే–హైదరాబాద్, హైదరాబాద్‌–బెంగళూరు, హైదరాబాద్‌–చెన్నై కూడా...

తూర్పు నుంచి పశ్చిమానికి డెడికేటెడ్‌ రవాణా కారిడార్‌

రైల్వే శాఖకు రూ.2.77 లక్షల కోట్ల కేటాయింపు

లోకోమోటివ్స్, వేగన్లు కొనుగోలుకు రూ.52,108.73 కోట్లు 

రైల్వే భద్రతపై ఫోకస్‌: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

న్యూఢిల్లీ: భారతీయ రైల్వేని అత్యాధునికంగా రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైస్పీడ్‌ రైల్, రవాణా సామర్థ్యం పెంపు, భద్రత విభాగాలపై మరింత దృష్టి కేంద్రీకరించింది. ఇందులోభాగంగా దేశంలో ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ ఏడు హైస్పీడ్‌ రైల్వే కారిడార్లను ఏర్పాటుచేయాలని బడ్జెట్‌లో ప్రతిపాదించింది. అభివృద్ధి అనుసంధానకర్తగా భావించే ఈ కారిడార్లను ముంబై–పుణే, పుణే–హైదరాబాద్, హైదరాబాద్‌–బెంగళూరు, హైదరాబాద్‌–చెన్నై, చెన్నై–బెంగళూరు, ఢిల్లీ–వారణాసి, వారణాసి–సిలిగురి మధ్య ఏర్పాటుచేయాలని ప్రకటించింది. 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2026–27 బడ్జెట్‌లో రైల్వే శాఖకు రూ.2,77,830 కోట్లను కేటాయించారు. దీంతోపాటు అదనపు బడ్జెటరీ వనరుల నుంచి రూ.15 వేల కోట్లు సమకూరుతాయని బడ్జెట్‌ పత్రంలో పేర్కొన్నారు. ఈ నిధులతో కొత్తలైన్ల నిర్మాణ,ం లోకోమోటివ్స్, కోచ్‌లు, వేగన్ల కొనుగోలు, ఇతర పనులు చేపడతారు. 2025–26లో రైల్వేకి 2,52,000 కోట్లు కేటాయించగా, ఈసారి 10.25 శాతం ఎక్కువగా కేటాయించారు. ఇప్పటివరకు రైల్వేకి చేసిన కేటాయింపుల్లో ఇదే అత్యధికం కావడం విశేషం. 

రవాణా కారిడార్‌
» సుస్థిర రవాణా కోసం డెడికేటెడ్‌ రవాణా కారిడార్‌ (డీఎఫ్‌సీ)ను డాంకునీ (పశ్చిమబెంగాల్‌) నుంచి సూరత్‌ (గుజరాత్‌) వరకు 2.052 కి.మీ. నిడివి తో ఏర్పాటుచేయాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. దీన్ని తూర్పు– పశ్చిమ డీఎఫ్‌ఏసీగా పేర్కొంటారు.
» అధిక రద్దీ ఉండే 18 వేల కి.మీ. ట్రాక్‌ మార్గంలో భద్రతకు నిర్దేశించిన కవచ్, సీసీటీవీ కెమెరాలు, టెలికం కోసం రూ.7,500 కోట్లు కేటాయించారు. రైల్వే నెట్‌వర్క్‌ మొత్తానికి కవచ్‌ వ్యవస్థను ఏర్పాటుచేయాలని బడ్జెట్‌ లో పేర్కొన్నారు
» దేశీయ కంటెయినర్‌ తయారీ కోసం కొత్త పథకం ప్రవేశపెడుతూ రూ.10వేల కోట్లు కేటాయించారు. 
» లోకోమోటివ్స్, వేగన్లు తదితరాల కొనుగోలుకు రూ.52,108.73 కోట్లు కేటాయించారు. దీంతో మరిన్ని వందేభారత్‌ రైళ్లు, 24–కోచ్‌ స్లీపర్‌ రైళ్లను తీసుకుంటారు.
» అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి కోసం రూ.11,917 కోట్లు కేటాయించారు. 
» కొత్త లైన్ల నిర్మాణానికి రూ.36,721.55 కోట్లు, రూ. గేజ్‌ మార్పిడికి రూ.4,600 కోట్లు, డబ్లింగ్‌ పనులకు రూ. 37,750 కోట్లు కేటాయించారు.

రూపురేఖలు మారిపోతాయి
హైస్పీడ్‌ రైల్వే కారిడార్ల నిర్మాణంతో దేశ రవాణారంగం రూపురేఖలు మారిపోతాయని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చెప్పారు. ఏడు కారిడార్లు మొత్తం 4000 కి.మీ. నిడివితో విస్తరించి ఉంటాయని తెలిపారు. బడ్జెట్‌ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈసారి రూ.1.20 లక్షల కోట్లు ప్రయాణికులు, భద్రత కోసం వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు. భద్రతపై రైల్వే ఎక్కువ ఫోకస్‌ పెట్టిందని, దీనివల్ల 95 శాతం రైలు ప్రమాదాలు తగ్గినట్లు తెలిపారు. ముంబై–అహ్మదాబాద్‌ మధ్య తొలిసారి చేపట్టిన హైస్పీడ్‌ రైలు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు.  – రైల్వే మంత్రి

3,547.32 కోట్ల మిగులు
రైల్వే శాఖకు వచ్చే సంవత్సరంలో రూ.3,85,733.33 కోట్ల ఆదాయం వస్తుందని, రూ. 3,82,186.01 కోట్లు వ్యయమవుతాయని బడ్జెట్‌లో అంచనా వేశారు. ఆర్థిక సంవత్సరాంతానికి రూ. 3,547.32 కోట్లు మిగులుతుందని భావిస్తున్నారు. 2024–25లో రైల్వేకి రూ. 3,35,757.09 కోట్ల ఆదాయం సమకూరగా, రూ.3,32,440.64 కోట్లు వ్యయమైంది. రూ.3,316.45 కోట్లు మిగులు వచ్చింది.  

మ్యాచ్‌ సమ్మరీ
వందే భారత్‌తో రైల్వే శాఖ బౌలింగ్‌ స్పీడు పెరిగింది. ఆ స్పీడు మరింత పెంచేందుకు వీలుగా... ఎంత ఫాస్ట్‌ బౌలింగ్‌నైనా తట్టుకునేందుకు తగ్గ పిచ్‌లు తయారు చేయాలని మోదీ సర్కారు సంకల్పించింది. దేశవ్యాప్తంగా 7 హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లను ప్రతిపాదించింది. ఇవి అమల్లోకి వస్తే కొత్త రైళ్లు హైస్పీడ్‌ బంతుల్లా దూసుకెళతాయి. 

స్థిరమైన ఆటకు తగ్గ పిచ్‌లా సరకు రవాణాను గాడిలో పెట్టడానికి డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ అక్కరకొస్తుంది. కవచ్, సీసీటీవీలతో భద్రతపై పెట్టే వ్యయం... నోబాల్స్,  వైడ్స్‌కు అడ్డుకట్ట వేస్తుంది. రూ.2.77 లక్షల కోట్ల భారీకేటాయింపుతో ఈ బడ్జెట్‌లో రైల్వే మామూలు ఓవర్‌ కాదు. దేశ రవాణాను వేగంగా నడిపించే పవర్‌ స్పెల్‌ వేసింది.

బెంగాల్‌కు కొత్తగా సరుకు రవాణా కారిడార్‌
బడ్జెట్‌లో ప్రకటించిన నిర్మల
పశ్చిమబెంగాల్‌ ఎన్నికల ఎత్తుగడగా అభివర్ణించిన టీఎంసీ
కోల్‌కతా: పశ్చిమబెంగాల్, గుజరాత్‌ మధ్య వేగవంతమైన సరుకు రవాణా లక్ష్యంగా సరికొత్త కారిడార్‌ను ఆర్థికమంత్రి నిర్మల ఆదివారం బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ‘సమీకృత ఈశాన్య భారత పారిశ్రామిక కారిడార్‌’లో భాగంగా పశ్చిమబెంగాల్‌లోని డంకునీ నుంచి గుజరాత్‌లోని సూరత్‌కు నూతన సరుకు రవాణా కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నట్లు నిర్మల ప్రకటించారు. బెంగాల్‌లోని దుర్గాపూర్‌ కేంద్రంగా ఈ కారిడార్‌ను విస్తరిస్తామని చెప్పారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పర్యాటక పథకమైన ‘పూర్వోదయ విజన్‌’లో భాగంగా మరింత అభివృద్ధి చేస్తామని నిర్మల వెల్లడించారు. 

డంకునీ సూరత్‌ ఫ్రీట్‌ కారిడార్‌ అనేది పర్యావరణ అనుకూలమైనదేకాకుండా ఇరు రాష్ట్రాల మధ్య సరుకు రవాణా ఖర్చులనూ భారీగా తగ్గిస్తుందని నిర్మల పేర్కొన్నారు. నదీజల మార్గాల గుండా జరిగే సరకు రవాణాను సమీకృత కారిడార్లతో అనుసంధానించి బెంగాల్‌ పారిశ్రామికాభివృద్ధిని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తామని నిర్మల తెలిపారు. 294 నియోజకవర్గాలున్న పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీకి మరో మూడునెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ బెంగాల్‌కు మోదీ సర్కార్‌ వరాల జల్లు కురిపించడం గమనార్హం. 

పూర్వోదయ రాష్ట్రాలుగా పిలుచుకునే బిహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని ఆమె తెలిపారు. 4,000 ఎలక్ట్రిక్‌ బస్సుల అందజేతతోపాటు ఆయా రాష్ట్రాల్లో ఉపాధి పెంపు, ఆయా రాష్ట్రాల మధ్య జనం, వస్తూత్పత్తుల రవాణాపై దృష్టిపెట్టామని ఆమె వెల్లడించారు. 

విమర్శించిన తృణమూల్‌ కాంగ్రెస్‌
రాష్ట్రానికి కొత్తగా సరుకు రవాణా కారిడార్‌ తెస్తామన్న నిర్మల నిర్ణయంపై బెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ పెదవి విరిచింది. ‘పాత ప్రతిపాదనలకే కొత్త తాయిలాల పొట్లంలో కట్టి ఇస్తున్నారు. నిధుల మంజూరును గాలికొదిలేసి కేవలం కాగితాలకు పరిమితమయ్యే వాగ్దానాలు చేస్తున్నారు. ఇదంతా ఎన్నికల ఎత్తుగడ. గత ఐదేళ్లుగా ఇదే చూస్తున్నాం. 

బెంగాల్‌కు మోదీ సర్కార్‌ కేంద్రనిధులపై శ్వేతపత్రం జారీచేసే దమ్ముందా? 2021లో బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం తర్వాత మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఒక్క కూలీకి అయినా ప్రత్యక్ష బదిలీ పథకం(ఈబీటీ) ద్వారా నగదు ఇచ్చినట్లు రుజువుచేస్తే రాజకీయ సన్యాసం చేస్తా’ అని టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్‌ బెనర్జీ వ్యాఖ్యానించారు. 

ఎన్నికల వ్యూహంగా అభివర్ణించిన విశ్లేషకులు
అభివృద్ధి అని చెబుతున్నా వాస్తవానికి తాజా కేటాయింపులు కేవలం ఎన్నికల ఎత్తు గడగా భావించవచ్చని ఎన్నికల వ్యూహకర్తలు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న టీఎంసీని గద్దెదించడమే లక్ష్యంగా బీజేపీ భారీ కేటాయింపులు చేస్తోందని వారు వ్యాఖ్యానించారు. ‘‘ ఎన్నికలున్న రాష్ట్రాలకు బడ్జెట్‌లో భారీ వడ్డనలు ఉండటం ఇటీవలికాలంలో ఒక సంప్రదాయంగా మారింది. ఈ కేటాయింపులు వాస్తవాలో కాదో గుర్తెరిగి తదుపరి ఎన్నికల్లో ఓటేసే స్పృహ ఓటర్లకు ఉండాల్సిందే’’ అని చెబుతున్నారు.

తమిళనాడు సంస్కృతి పరిరక్షణకు..
కొత్తగా అరుదైన మూలకాల రవాణా కారిడార్‌
చెన్నై మీదుగా హైస్పీడ్‌ రైలు లింక్‌
పొధుగైమలై వద్ద మౌంటేన్‌ ట్రెయిల్‌
చెన్నై: డీఎంకే ఏలుబడిలో ఉన్న తమిళనాడుపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలో కొత్తగా అరుదైన ఖనిజాల రవాణా కారిడార్‌ను నెలకొల్పనున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. దీంతోపాటు చెన్నై మీదుగా పయనించే హైస్పీడ్‌ రైలు లింక్‌లను అభివృద్ధిచేయనున్నారు. పశ్చిమ కనుమల మార్గంలో పొధుగైమలై కొండ ప్రాంతంలో హైకింగ్, ట్రెక్కింగ్, మౌంటేన్‌ బైకింగ్‌ వంటి సదుపాయాలు కల్పించను న్నారు. 

పులికాట్‌ సరస్సుకు విచ్చేసే విదేశీ పక్షుల కోలాహలం, ప్రకృతి అందాలను పర్యాటకులు వీక్షించేందుకు బర్డ్‌ వాచింగ్‌ పాయింట్లను నిర్మించనున్నారు. త్వరలో తమిళ నాడు అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం పలు అభివృద్ధి పథకాల నిధులను భారీగా కేటాయించడం విశేషం. ఇనుప రాతి యుగం నాటి ప్రఖ్యాత ఆదిచనల్లూర్‌ ప్రాంతంలో పురాతత్వ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అక్కడ లభించిన పురాతన రాళ్లు, ఆనాటి నాగరికత వైభవాన్ని చాటే వస్తువులతో ఆర్కియాలాజికల్‌ సైట్‌ను అభివృద్ధిచేయనున్నారు. 

నాటి సంస్కృతికి కళ్లకు కట్టేలా అభివృద్ధి చేస్తామని ఆమె వెల్లడించారు. నడకదారిలో మొత్తం పురాతత్వ ప్రాంతాన్ని కలియతిరిగేలా వాక్‌వేలను నిర్మించనున్నారు. అక్కడి ప్రాచీన వస్తు వుల విశిష్టతను కథల రూపంలో చెప్పే లా, నాటి సాంకేతికతలను విడమర్చి విశదీకరించేలా గైడ్‌లను అందుబాటు లోకి తేనున్నారు. పాడైన ప్రాచీన వస్తు వులకు మరమ్మతులు, సంరక్షణ కోసం కన్జర్వేటివ్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేయ నున్నారు. 

పురాతత్వ ప్రాంతానికి విచ్చేసే పర్యా టకులు, విదేశీ సందర్శకుల్లో ఆ ప్రాంతంపై మరింత అవగాహన పెంచేలా ఎగ్జిబిషన్‌ల వంటివి ఏర్పా టుచేయనున్నారు. ‘అత్యంత అరుదైన మూలకాల కోసం ఖనిజాల తవ్వకం కోసం తమిళనాడులో రేర్‌ ఎర్త్‌ కారిడార్‌ను ఏర్పాటుచేయబోతున్నాం. ఖనిజాల శుద్ధి, పరిశోధన, తయారీని మరింతగా ప్రోత్సహిస్తాం’ అని మంత్రి నిర్మల అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement