కేంద్ర కేబినెట్ నిర్ణయం
న్యూఢిల్లీ: తయారీరంగంలో మరింత వృద్ధి సాధనే లక్ష్యంగా తీసుకొస్తున్న భారత్ ఉద్యోగిక్ వికాస్ యోజన(భవ్య) పథకం కోసం రూ.33,660 కోట్లు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ మేరకు బుధవారం ప్రధాని మోదీ సారథ్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో 100 ప్లగ్–అండ్–ప్లే పారిశ్రామిక పార్క్ల కల్పన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదముద్రవేసింది. కేబినెట్ నిర్ణయాలను తర్వాత సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ప్రత్యక్షంగా 15 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా భవ్య పథకాన్ని ఆరంభిస్తున్నట్లు తెలిపారు.
మరికొన్ని నిర్ణయాలు..
→ పత్తి సేకరణ కోసం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) 2023–24 కాటన్ సీజన్లో కనీస మద్దతు ధర కోసం ఖర్చుచేసిన మొత్తాలను రీయింబర్స్చేసేందుకు ఉద్దేశించిన రూ.1,718.56 కోట్ల నిధుల మంజూరుకు కేబినెట్ ఓకే చెప్పింది.
→ ఉత్తరప్రదేశ్లో 927 జాతీయరహదారి వెంట బారాబంకీ నుంచి బహ్రెయిచ్ల మధ్య అనుసంధానాన్ని మరింత మెరుగుపరిచే లక్ష్యంతో నాలుగు వరసల రహదారి నిర్మాణానికి అవసరమైన రూ.6,969.04 కోట్ల నిధుల మంజూరు ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ అంగీకారం తెలిపింది. ఆర్థిక, సామాజిక, వస్తూత్పత్తుల హబ్ల మధ్య అనుసంధానం పెంచేందుకు 101.51 కిలోమీటర్ల పొడవునా రోడ్డును నిర్మించనున్నారు.
→ మరో 1,500 మెగా వాట్ల శుద్ద ఇంధన సామర్థ్యాన్ని పెంచుకునే లక్ష్యంతో తలపెట్టే చిన్న జలవిద్యుత్ ప్రాజెక్టుల కోసం రూ.2,584.60 కోట్ల ఆర్థికసాయం చేసే ప్రతిపాదనలకు కేంద్రకేబినెట్ ఆమోదముద్ర వేసింది.


