పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేల భారత ప్రధాని నరేంద్ర మోదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ సంభాషణలో హర్ముజ్ జలసంధి ద్వారా సురక్షిత వాణిజ్య నౌకాయానంపై ఇద్దరు నాయకులు చర్చించారు.
మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్న ప్రకారం.. నా సోదరుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో మాట్లాడాను. అతనికి ముందస్తుగా ఈద్ శుభాకాంక్షలు. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులపై ఇద్దరం చర్చించాం.
హర్ముజ్ జలసంధి ద్వారా సురక్షితమైన, స్వేచ్ఛాయుతమైన నావిగేషన్ అవసరమని మేము అంగీకరించాము. యూఏఈపై జరిగిన దాడులను భారతదేశం తీవ్రంగా ఖండిస్తుంది. పశ్చిమాసియాలో శాంతి, భద్రత, స్థిరత్వం కోసం కలిసి పని చేస్తాము.
కాగా, ఇరాన్పై ఇజ్రాయెల్–అమెరికా యుద్ధం ప్రారంభమైన తర్వాత మోదీ, యూఏఈ అధ్యక్షుడి మధ్య ఫోన్ సంభాషణ జరగడం ఇది రెండోసారి. మార్చి 2న కూడా మోదీ యూఏఈ అధ్యక్షుడితో మాట్లాడి దాడులను ఖండించారు.
మోదీ ఇటీవల సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, జోర్డాన్ రాజు అబ్దుల్లా II, ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్, కువైట్ క్రౌన్ ప్రిన్స్ షేక్ సబాహ్ అల్-ఖాలెద్ అల్-సబాహ్, ఖతార్ అమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో కూడా మాట్లాడారు.


