సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ గూండాల దాడి, ఆపై ఆయన్నే అరెస్ట్ చేయడాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. గుంటూరులో టీడీపీ గుండాగిరిపై ఆదివారం కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసింది. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి ఈ మేరకు ఆ వివరాలు వెల్లడించారు.
రాష్ట్రంలో పోలీసులు రూల్ ఆఫ్ లా ను గాలికి వదిలేశారు. ప్రతిపక్షల నేతల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు పై హత్యాయత్నం జరిగింది. రాళ్లు కర్రలతో ఆయన ఇంటిపై దాడికి దిగారు. ఆస్తులు వాహనాలన్నిటిని ధ్వంసం చేశారు. పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగింది. కాపాడాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. ఫలితంగా హింస ఇంకా కొనసాగుతోంది. ఈ వివరాలతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్కి ఫిర్యాదు చేశాం. ఏపీలో శాంతిభద్రతల పునరుద్ధరణకు వెంటనే జోక్యం చేసుకోవాలని కోరాం..
..ఏపీలో ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. పోలీసు వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయడం లేదు. దాడుల్ని నియంత్రించేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అందుకే కేంద్ర హోంశాఖ వెంటనే జోక్యం చేసుకొని శాంతిభద్రతలను చక్కదిద్దాలి. పరిస్థితులు మరింత దిగజారకుండా తగిన చర్యలు తీసుకోవాలి’’ అని లేఖ ద్వారా కేంద్రాన్ని కోరినట్లు వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.


