లోక్‌సభలో అవే దృశ్యాలు.. మళ్లీ వాయిదా | LS adjourned for day amid row over Rahul Gandhi quoting ex-Army chief unpublished book | Sakshi
Sakshi News home page

లోక్‌సభలో అవే దృశ్యాలు.. మళ్లీ వాయిదా

Feb 10 2026 3:52 AM | Updated on Feb 10 2026 4:21 AM

LS adjourned for day amid row over Rahul Gandhi quoting ex-Army chief unpublished book

న్యూఢిల్లీ: లోక్‌సభలో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. అధికార, విపక్షాల మధ్య పలు అంశాలపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉండటంతో సోమవారం కూడా సభ కార్యకలాపాలేవీ చేపట్టకుండానే వాయిదా పడింది. తొలుత ఉదయం రెండుసార్లు, అనంతరం మధ్యాహ్నం రెండింటి తర్వాత మంగళవారానికి సభను వాయిదా వేయాల్సి వచ్చింది. 

వారం రోజులుగా సభ నిత్యం అంతరాయాలనే ఎదుర్కొంటూ వస్తుండటం తెలిసిందే. ఆర్మీ మాజీ చీఫ్‌ ఎం.ఎం.నరవణె పుస్తకంలోని అంశాలను ప్రస్తావించేందుకు విపక్ష నేత రాహుల్‌గాంధీ ప్రయత్నించడం, అందుకు మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌ షా తీవ్ర అభ్యంతరం తెలపడం రగడకు దారితీసింది. నాటినుంచి సభలో ఆందోళనలు మినహా కార్యకలాపాలేవీ సాగడం లేదు. 

పదేపదే అవాంతరాలు 
ఉదయం 11 గంటలకు లోక్‌సభ సమావేశం కాగానే ప్రశ్నోత్తరాలు చేపట్టింది. ఆ వెంటనే విపక్ష సభ్యులు తమ స్థానాల నుంచి లేచి నినాదాలకు దిగారు. తాము లేవనెత్తిన పలు అంశాలపై తక్షణ చర్చకు పట్టుబట్టారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా వాటిని లేవనెత్తవచ్చని స్పీకర్‌ ఓం బిర్లా సూచించారు. రాహుల్‌తో సహా సభ్యులంతా తమ అంశాలను లేవనెత్తవచ్చన్నారు. అయినా సభ్యులు వెనక్కు తగ్గకపోవడంతో తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. 

కేవలం కార్యకలాపాలను స్తంభింపజేయడమే లక్ష్యంగా వారు వ్యూహం రూపొందించుకుని సభకు వచ్చారంటూ మండిపడ్డారు. అయినా సభ్యులు శాంతించకపోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటల దాకా వాయిదా వేశారు. తిరిగి సమావేశం కాగానే, ముందుగా రాహుల్‌ను మాట్లాడనివ్వాల్సిందేనని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. నిబంధనల మేరకు బడ్జెట్‌పై చర్చ ప్రారంభం కావాల్సి ఉందని సభాపతి స్థానంలో ఉన్న తెన్నేటి కృష్ణప్రసాద్‌ పేర్కొన్నారు. 

కాంగ్రెస్‌ తమ ప్రధాన వక్తగా శశి థరూర్‌ పేరు ఇచి్చనందున ఆయన మాట్లాడాలని సూచించారు. విపక్షాల నినాదాలు ఆగకపోవడంత సభ మధ్యాహ్నం రెండిటితో  వాయిదా పడిడంది. తిరిగి సమావేశం కాగానే సభాపతి స్థానంలో ఉన్న సంధ్యా రాయ్‌ బడ్జెట్‌పై చర్చను ప్రారంభించాల్సిందిగా థరూర్‌కు సూచించారు. తన ప్రసంగానికి ముందు విపక్ష నేత రాహుల్‌ కొన్ని అంశాలను లేవనెత్తదలచారని థరూర్‌ పేర్కొన్నారు. రాహుల్‌ బడ్జెట్‌పై ప్రసంగిస్తే అభ్యంతరం లేదని రాయ్‌ బదులిచ్చారు. 

అనంతరం రాహుల్‌ మాట్లాడుతూ, బడ్జెట్‌పై చర్చకు ముందు పలు అంశాలపై మాట్లాడేందుకు తనకు అవకాశమివ్వాలని పట్టుబట్టారు. అందుకు తనకు అవకాశమిస్తానని విపక్ష సభ్యులతో సమావేశం సందర్భంగా స్పీకర్‌ అంగీకరించినట్టు వెల్లడించారు. కానీ అలాంటిదేమీ లేకుండా నేరుగా బడ్జెట్‌పై చర్చను మొదలు పెడుతున్నారంటూ ఆక్షేపించారు.

 తనకు అలాంటి సమాచారమేదీ లేనందున ఇతర అంశాలు లేవనెత్తేందుకు అనుమతించలేనని రాయ్‌ పేర్కొన్నారు. స్పీకర్‌ అలాంటి అంగీకారానికి రాలేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్‌ రిజిజు స్పష్టం చేశారు. ఒప్పందంపైనే రాహుల్‌ మాట్లాడాలనుకుంటే దానిపై స్పందించేందుకు స్పీకర్‌ సభలో అందుబాటులో ఉండాల్సి ఉంటుందన్నారు. అధికార, విపక్షాల్లో ఎవరూ పట్టు వీడకపోవడంతో సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు రాయ్‌ ప్రకటించారు. 

ప్రధాని ప్రసంగం లేకుండానే ధన్యవాద తీర్మానం ఫిబ్రవరి 5న ఆమోదం పొందడం తెలిసిందే! ఇలా జరగడం 22 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఫిబ్రవరి 4న ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించే సందర్భంగా ఆయన స్థానం వద్దకు వెళ్లి అనూహ్య చర్యకు పాల్పడాలని కాంగ్రెస్‌ ఎంపీలు నిర్ణయించుకున్నట్టు కచి్చతమైన సమాచారం అందిందని స్పీకర్‌ పేర్కొన్నారు. అందుకే ఆయన భద్రత దృష్ట్యా సభకు రావద్దని తానే సూచించినట్టు తెలిపారు. దీన్ని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకాగాంధీ వాద్రా తోసిపుచ్చారు. అది పచ్చి అబద్ధమన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement