తెలంగాణ డీజీపీ నియామకంలో జాప్యం వద్దు | Supreme Court has given UPSC another four weeks time | Sakshi
Sakshi News home page

తెలంగాణ డీజీపీ నియామకంలో జాప్యం వద్దు

Feb 6 2026 2:36 AM | Updated on Feb 6 2026 2:36 AM

Supreme Court has given UPSC another four weeks time

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ డీజీపీ నియామక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సుప్రీంకోర్టు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ)ని ఆదేశించింది. హైకోర్టు విధించిన గడువుకు అదనంగా మరో నాలుగు వారాల సమయాన్ని ఇచ్చింది. తక్షణమే ఎంప్యానెల్‌మెంట్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల ఆధారంగా అర్హులైన అధికారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. తెలంగాణ డీజీపీ ఎంపిక విషయమై  హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ యూపీఎస్సీ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జాయ్‌ మాల్య బాగ్చీల ధర్మాసనం విచారించింది. యూపీఎస్సీ తరపు సీనియర్‌ న్యాయవాది నరేష్‌ కౌశిక్‌ వాదనలు వినిపిస్తూ.. ‘తెలంగాణలో 2017లో మాజీ డీజీపీ అనురాగ్‌ శర్మ రిటైర్‌ అయ్యారు. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్‌ డీజీపీ కోసం ప్రతిపాదనలు పంపలేదు. సుదీర్ఘ కాలం తర్వాత 2025 ఏప్రిల్‌లో జాబితా పంపింది. ఇంత జాప్యం జరిగినందున, దీనిపై స్పష్టత కావాలి’అని చెప్పారు. 

మరి రాష్ట్రం పరిస్థితి ఏంటి? 
యూపీఎస్సీ వాదన విన్న సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ సూటిగా స్పందించారు. ’తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ మీరు పిటిషన్‌ వేశారు సరే.. ఒకవేళ మీ వాదనను అంగీకరించి హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇస్తే, తెలంగాణ రాష్ట్రం పరిస్థితి ఏంటి? అక్కడ యాక్టివ్‌ డీజీపీ లేకుండా పోతారు కదా? పిటిషన్‌ వేసే ముందు ఈ పరిణామం గురించి యూపీఎస్సీ ఎందుకు ఆలోచించలేదు?’అని నిలదీశారు. రాష్ట్రం మూడు నెలల గడువు పాటించనప్పుడే.. యూపీఎస్సీ ఎందుకు కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేయలేదని ధర్మాసనం ప్రశ్నించింది. 

అప్పుడు మౌనంగా ఉండి, ఇప్పుడు హైకోర్టు ఆదేశాలు ఇచ్చాక సాకులు చెప్పడం సరికాదని చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో నియామక ప్రక్రియను నిలిపివేస్తే అది పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వ జాప్యానికి సహకరించినట్లవుతుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రెగ్యులర్‌ డీజీపీలను నియమించకుండా, యాక్టింగ్‌ (ఇన్‌చార్జి) డీజీపీలతో పాలన సాగిస్తున్న విధానంపై సీజేఐ అసహనం వ్యక్తం చేశారు. ‘రాష్ట్ర ప్రభుత్వాల వలలో మీరు (యూపీఎస్సీ) పడకండి. అసలు రాష్ట్రాలకు పూర్తిస్థాయి డీజీపీలు ఉండటం ఇష్టం లేదు. తమకు నచ్చినట్లుగా వ్యవహరించే, తమకు అనుకూలంగా ఉండే యాక్టింగ్‌ లేదా తాత్కాలిక డీజీపీలే వారికి కావాలి. అందుకే ఈ జాప్యమంతా’ అని సీజేఐ వ్యాఖ్యానించారు.  

యూపీఎస్సీకి కోర్టు ధిక్కరణ అస్త్రం 
ప్రకాశ్‌ సింగ్‌ కేసులో ఇచ్చిన మార్గదర్శకాలను రాష్ట్రాలు ఉల్లంఘిస్తున్నాయని ధర్మాసనం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమకు నచ్చిన అధికారులను కొనసాగించేందుకు నియామకాల్లో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నాయని, దీనివల్ల అర్హత, మెరిట్‌ ఉన్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. డీజీపీ పదవీ విరమణకు ముందే రాష్ట్రాలు ప్రతిపాదనలు పంపాలని, ఒకవేళ రాష్ట్రాలు సకాలంలో స్పందించకపోయినా, జాప్యం చేసినా.. ఇకపై యూపీఎస్సీ నేరుగా సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేయొచ్చని స్పష్టం చేసింది. రాజకీయ ప్రాధాన్యతలతో కాకుండా.. అధికారుల సరీ్వస్‌ రికార్డు, సీనియారిటీ, మెరిట్‌ ఆధారంగానే డీజీపీ ఎంపిక జరగాలని తేల్చిచెప్పింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement